Education Dept | త‌క్ష‌ణ చ‌ర్య‌లివే…

Education Dept | త‌క్ష‌ణ చ‌ర్య‌లివే…

Education | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పాఠశాల ప్రాంగణాల్లో నిర్మించబడిన గ్రామ సచివాలయాలు, ఇతర సంస్థల భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసు నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ టైమ్ బౌండ్ వర్క్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెమోలో పేర్కొన్నారు. పాఠశాలల పరిపాలనా నియంత్రణలో ఉన్న భవనాలు, భూములు పూర్తిగా విద్యాశాఖ ఆధీనంలోకి తీసుకోవాలని, ఇతర శాఖల వినియోగం ఉంటే వెంటనే ఖాళీ చేయించి పాఠశాల అవసరాలకే ఉపయోగించాలంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళుతూ, పాఠశాల ప్రాంగణాల్లో ఇతర శాఖలు ఆక్రమించిన భవనాలను ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని పాఠశాల భవనాలపై విద్యాశాఖ స్వాధీనం తీసుకుని అనుసరణ నివేదిక (కంప్లయన్స్ రిపోర్ట్) సమర్పించాలని స్పష్టం చేశారు.

Education Dept |

ఇకపై పాఠశాల ప్రాంగణాలు, భూములు విద్యా కార్యకలాపాలకు సంబంధం లేని ఇతర అవసరాలకు వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూల్ ప్రాంగణాల్లో నిర్మించబడిన గ్రామ సచివాలయాలు లేదా ఇతర సంస్థల కార్యాలయాలు ఉన్నచో, వాటి వినియోగంపై పునఃపరిశీలన చేసి విద్యా అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో మేరకు అన్ని జిల్లా విద్యాధికారులు అఫిడవిట్ సమర్పిస్తూ పాఠశాల భవనాలు పూర్తిగా విద్యాశాఖ ఆధీనంలోకి తీసుకున్నామని ధృవీకరించాల్సి ఉంటుంది.

విద్యా కార్యకలాపాలకు సంబంధం లేని వినియోగాన్ని ఇకపై అనుమతించబోమని, ఈ విషయంలో ఏవైనా విరుద్ధ చర్యలు జరిగితే వాటిని తీవ్రంగా పరిగణిస్తామని విద్యాశాఖ హెచ్చరించింది. విద్యార్థుల విద్యా వాతావరణం దెబ్బతినకుండా పాఠశాలల భూమి, భవనాలు పూర్తిగా విద్యా అవసరాలకే వినియోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Education Dept |

ఈ ఆదేశాలను “మోస్ట్ అర్జెంట్”, “టైమ్ బౌండ్” కేసుగా పరిగణించి తక్షణ అమలు చేయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చినవీరభద్రుడు వడ్రేవు స్పష్టంగా ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా విద్యాధికారులు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, సమగ్ర శిక్ష అధికారులు ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల సంరక్షణ, విద్యా ప్రమాణాల పరిరక్షణ దృష్ట్యా విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా భావిస్తున్నారు.

click here to read more : Temple | బయటపడిన దేవుని మహిమ…

click here to read more :



Leave a Reply