Ditwah cyclone | దిత్వా బలహీనపడినా…?
Ditwah cyclone, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దిత్వా తుఫాన్ జనాన్ని టెన్షన్ పెడుతుంది. అయితే.. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాన్ తీవ్రవాయుగుండంగా బలహీనపడింది. శ్రీలంక (Srilanka) తీరాన్ని తాకిన తర్వాత ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేసింది. అయితే.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ… తుఫాన్ గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బలహీనపడిందని తెలిపారు.
ఇప్పుడు ఇది మరింత బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు గట్టిగా హెచ్చరించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి (Tirumala) జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు.
అయితే.. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది. ఇక దిత్వా ఎఫెక్ట్ తెలంగాణ (Telangana) పై కూడా పడింది. ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది.

