Devotees | ఇక ఆన్లైన్.. ఆల్రైట్
- ఆన్లైన్ టికెట్ల జారీ సరళం
- మనమిత్ర వాట్సాప్ ద్వారా 14 సేవలు
- స్పర్శ దర్శనం శీఘ్ర అతి శీఘ్రదర్శనం భక్తులకు అందుబాటులో..
- మన మిత్ర వాట్సాప్ నంబర్.. 9552300009
Devotees | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం అమలు చేస్తున్న ఆన్లైన్ విధానాన్ని భక్తులకు అందుబాటులో ఉండేందుకు సరళీకృతం చేశామని కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం అన్ని శాఖల అధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ ఆన్లైన్ ద్వారా భక్తులు స్వామివారి స్పర్శ దర్శనం, రూ.300 అతి శీఘ్రదర్శనం, రూ. 150కు శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
అలాగే స్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైన 14 ఆర్జితసేవలకు సంబంధించిన సేవాటిక్కెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని పేర్కొన్నారు. అదేవిధంగా వసతిని కూడా ముందస్తుగా ఆన్లైన్లో రిజర్వు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు.
ఇందుకోసం భక్తులు రాష్ట్ర దేవదాయశాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in లేదా దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.srisailadevasthanam.org ల ను మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009 ద్వారా కూడా 14 సేవలను అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీస్వామి వారి స్పర్శదర్శనం, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్లను, ఆర్జిత సేవాటిక్కెట్లను పొందవచ్చునన్నారు. ప్రతీ ఉద్యోగి, ప్రతీ అధికారి కూడా ఈ విషయమై భక్తులకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఉద్యోగులందరు కూడా ఆన్లైన్ టికెట్ వివరాలను, చరవాణిలో స్టేటస్గా ఉంచాలన్నారు. అదేవిధంగా ఆన్లైన్ వివరాలను దేవస్థానంలో స్వచ్ఛందసేవలు అందించే శివసేవకులకు కూడా తెలియజెప్పాలన్నారు. ఆన్లైన్ నందు టికెట్ బుక్ చేసుకున్నవారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

కాగా భక్తులలో కల్పించేందుకు ఇప్పటికే పలుచోట్ల ఆన్లైన్ విధానాన్ని క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతూ మరిన్ని బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రచార, ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించారు. క్షేత్ర పవిత్రతను కాపాడే చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలని ముఖ్య భద్రతా అధికారిని ఆదేశించారు. దేవస్థానం టోల్గేట్ వద్ద కట్టుదిట్టంగా తనిఖీలను నిర్వహించాలని ముఖ్య భద్రతాధికారిని ఆదేశించారు. కాగా ఆర్జితసేవా కర్తలు, స్పర్శదర్శనం టిక్కెట్ పొందిన వారు విధిగా ఆన్లైన్ ద్వారా పొందిన టిక్కెట్ ప్రింట్ కాపీని (హార్డ్కాపీని), ఆధార్కార్డు నకలును తమవెంట తెచ్చుకోవలసివుంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా పొందిన ఆయా టిక్కెట్లను స్కానింగ్ జరిపిన తదుపరి మాత్రమే ఆర్జితసేవాకర్తలను మరియు స్పర్శదర్శనం టిక్కెట్లు పొందిన వారిని అనుమతించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు టిక్కెట్టు / ప్రింటు కాపీని మరియు ఆధార్ కార్డ్ ప్రతిని ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవలసి ఉంటుందన్నారు.
కాగా సామాన్య భక్తుల సర్వదర్శనానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను అర్జితసేవలు నిర్దిష్టవేళలలో జరిపించబడుతున్నాయన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారి స్పర్శదర్శనం కూడా నిర్దిష్ట వేళల్లోనే కల్పించబడుతుందన్నారు.ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు పొందిన ఆర్జితసేవాకర్తలకు టిక్కెట్ పై సూచించిన సమయములో మాత్రమే ఆయా ఆర్జితసేవలు జరిపించబడుతాయని పేర్కొన్నారు. సేవాకర్తలు వారిసేవా సమయం కంటే కనీసం 15 నిమిషాలు ముందుగా ఆర్జితసేవా క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద రిపోర్టు చేయవలసి వుంటుందన్నారు. భక్తులందరు కూడా దేవస్థానం అందిస్తున్న ఆన్లైన్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని కార్యనిర్వహణాధికారి భక్తులకు సూచించారు.

