ఆగడాలపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం

ఆగడాలపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం..

  • రంగంలోకి హోంమంత్రి.. డీజీపీ
  • సివిల్ డీల్స్.. క్లబ్బులపై విచారణకు ఆదేశం

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్ జీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని, సివిల్ వ్యవహారాల్లో తల దూర్చడంతో తాము తలెత్తుకోలేక పోతున్నామని కూటమి నాయకులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు.

డీఎస్పీపై తరచు ఫిర్యాదులు రావడం, పేకాట శిబిరాలు పెరిగిపోయాయనీ, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్ కు ఫిర్యాదులు అందాయి. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తో ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరవాణిలో మంగళవారం మాట్లాడారు. పవన్ కల్యాణ్ పలు ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని పవన్ కోరినట్లు సమాచారం.

అసాంఘిక వ్యవహారాలకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అండగా ఉంటూ, సివిల్ వ్యవహారాల్లో డీఎస్పీ స్థాయి అధికారి ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తల దూర్చకుండా చూడాలని ఎస్పీకి పవన్ కళ్యాణ్సూచించినట్లు సమాచారం. ఇటువంటి వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియచేయాలని, ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

హోంమంత్రి, డీజీపీ దృష్టికి..

భీమవరం డీఎస్పీ జయ సూర్య వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సూచనతో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్త దృష్టికి మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై త్వరితగతన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు తెలుస్తుంది.

విచారణ చేస్తున్నాం – ఎస్పీ అద్నాన్ నయీం అస్మి

భీమవరం డీఎస్పీ జయ సూర్య కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడినట్లు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆంధ్రప్రభ కు తెలిపారు. డీఎస్పీ పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి విచారణలో తేలిన అంశాలు ప్రకారం శాఖా పరంగా చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.

ఏకపక్షంగా వ్యవహార శైలి..

భీమవరం డీఎస్పీ జయ సూర్య వ్యవహార శైలి కొంతమంది ముఖ్య నేతలకు అనుకూలంగా ఉండడంతో కూటమిలోని మరికొందరు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. తమ పరిధిలోని నాయకుడి మాట చెల్లకపోవడంతో సివిల్ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం వంటివి ఈ పంచాయితీకి కారణంగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట చెల్లటం లేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

గతంలో భీమవరంలో సీఐగా పనిచేసిన జయసూర్యకు స్థానికంగా బలమైన పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోటే భీమవరం డీఎస్పీ గా ఇక్కడ పనిచేస్తున్నారంటున్నారు. గతంలో డీఎస్పీల బదిలీల్లో భాగంగా జయ సూర్యను బదిలీ చేసినా తిరిగి రెండు రోజుల్లోనే తిరిగి వచ్చి చేరారు. ఎంత చెప్పినా ఏకపక్ష వ్యవహార శైలితో తాము పడుతున్న ఇబ్బందులను ఇలా ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు.

క్లబ్బుల వ్యవహారమే కారణమా..?

భీమవరం, పరిసర ప్రాంతాల్లో నిర్వహించే పేకాట క్లబ్బుల వ్యవహారం కూడా డీఎస్పీ పై ఫిర్యాదులకు కారణ ప్రధాన కారణంగా తెలుస్తుంది. పేకాట క్లబ్బులు సజావుగా సాగినంత కాలం ఎటువంటి ఫిర్యాదులు లేవని, గత కొద్ది కాలంగా పేకాట క్లబ్బులు కొనసాగకపోవడంతో కొందరికి భారీ స్థాయిలో ఆదాయానికి గండి పడిందంటున్నారు.

తమ ఆదాయానికి గండి పడటం, మరోపక్క అపార్ట్మెంట్లలో, శివారు ప్రాంతాలలో పేకాట, ఇతర జూద క్రీడల నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై మరొక కారణంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుని ఎలా ముగింపు పలుకుతారో.. వాస్తవాలను ఎంత మేరకు తెరపైకి తీసుకొస్తారో వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply