Delhi | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ !

  • బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న తెలంగాణ సర్కార్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీకి బయలుదేరుతున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను కలిసి, గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న తీవ్ర అభ్యంతరాలను వినిపించనున్నారు.

గోదావరి నుండి పోలవరం వద్ద 200 టీఎంసీ అడుగుల నీటిని రాయలసీమకు తరలించే ప్రణాళికను ఏపీ ప్రభుత్వం రూపొందించగా, ఇది తెలంగాణ హక్కులకు విఘాతం కలిగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సందర్భంలో, తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించబోయే ముఖ్యమైన విషయాలలో, గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR) ను తిరస్కరించాలని… వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ను పక్కన పెట్టాలని కూడా కోరుతుంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది

కాగా, ఇప్పటికే జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ ఢిల్లీలో పాటిల్‌ను కలిసి ఈ అంశంపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. అయితే ప్రభుత్వం మరింత దృష్టి సారించి, స్పష్టమైన చర్యల కోసం మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది.

రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ సర్కార్ ఎలాంటి రాజీ చేయబోదని స్పష్టంగా చెబుతోంది. గోదావరి నీటి వివాదం నేపథ్యంలో రేపటి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయంగా కీలకం కానుంది.

Leave a Reply