Delhi | ర‌క్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థల‌ను ఎపిలో ఏర్పాటు చేయండి – రాజ్ నాథ్ ను కోరిన చంద్రబాబు

న్యూ ఢిల్లీ – ఆంధ్రప్రదేశ్‌ను భారత రక్షణ, ఏరోస్పేస్ రంగాల భవిష్యత్తుకు ఒక మూలస్తంభంగా తీర్చిదిద్దే ప్ర‌ణాళిక‌ల‌లో భాగంగా థీమాటిక్ డిఫెన్స్ హబ్‌లు, డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ) అనుబంధ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఉత్కృష్టతా కేంద్రాలు) కేంద్రాల‌ను ఎపిలో ఏర్పాటు చేయాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ ను ఎపి సిఎం చంద్ర‌బాబు కోరారు.. భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వావలంబన దిశగా నడిపించే ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వివ‌రించారు.. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో ప‌లు డిఫెన్స్ సంస్థ‌లు ఏర్పాటు చేయాల‌ని, అందుకు త‌మ ప్ర‌భుత్వం అని విధాల స‌హ‌క‌రిస్తుంద‌ని తెలిపారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు నేడు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో రాజ్ నాథ్ ను క‌ల‌సి వివిధ ప్ర‌తిపాద‌న‌ల‌ను అంద‌జేశారు… ఈ భేటీలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించిన సమగ్ర ప్రణాళికపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సమావేశం అద్భుతంగా, ఫలవంతంగా సాగిందని తెలిపారు

ఇక రాష్ట్రంలో వ్యూహాత్మక మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన నూతన ఆవిష్కరణల ద్వారా రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రోత్సాహకరమైన స్పందన, మద్దతు పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఎంతగానో దోహదపడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply