డీలర్ల గగ్గోలు
బిక్కనూర్ , ఆంధ్రప్రభ : రేషన్ డీలర్లకు ఏడు నెలలుగా కమీషన్ అందకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు రేషన్ డీలర్లు తమ నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ ఏడు నెలలుగా అందకపోవడంతో దుకాణాలు నిర్వహిస్తున్న భవనాలకు కిరాయిలు సైతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాలో సుమారు ఆరు కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి.
కామారెడ్డి జిల్లాలో… కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 578 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అందులో 2,88,553 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో17,827 మంది లబ్ధిదారులకు అంత్యోదయ కార్డులు, 869 మందికి అన్నపూర్ణ కార్డులు, 2,69,898 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఉన్న 578 రేషన్ దుకాణాలకు గాను సగటున ప్రతి దుకాణం ద్వారా 100 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. డీలర్ల బియ్యం పంపిణీ చేసినందుకుగాను ప్రతి క్వింటాకు రూ.140 కమీషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో 95 రూపాయలు ,కేంద్ర ప్రభుత్వం ద్వారా 45 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. గత ఏడు నెలలుగా రేషన్ డీలర్లకు కమీషన్ రావాల్సి ఉంది. సుమారు 6 కోట్లకు పైగా రేషన్ డీలర్లకు బకాయిలు ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. తక్షణమే కమీషన్ డబ్బులు చెల్లించాలని కోరారు.