Congress | బీఆర్ఎస్ క్యాంపు శిబిరంపై దాడికి యత్నం

Congress |బీఆర్ఎస్ క్యాంపు శిబిరంపై దాడికి యత్నం
అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కౌన్సిలర్ ల తరలింపు
Congress | క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన చోట సైతం ఎలాగైనా పీఠం దక్కించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ఉన్న క్యాంపుపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. భద్రాచలంలోని నందిని హోటల్లో క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను సేదరగొట్టేందుకు పోలీసులు హోటల్ పై దాడి చేశారు. ముందుగానే సమాచారం అందుకొని అప్రమత్తమైన మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌన్సిలర్లను పోలీసులు తనిఖీలు చేయకముందే అక్కడి నుండి తరలించారు.
భద్రాచలం నుండి కౌన్సిలర్లను క్యాతనపల్లికి తరలించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా భద్రాచలం, మంగపేట, ములుగు, ఏటూరు నాగారం, కాటారం, చెన్నూరు గులాబీ శ్రేణులకు సమాచారం అందించి దారి పొడవునా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కౌన్సిలర్లు అందరినీ చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లిలో గల తన నివాసానికి తరలించారు. నియోజకవర్గంలోని గులాబీ సైన్యాన్ని పెద్ద ఎత్తున తన ఇంటి వద్ద మొహరించారు. సోమవారం జరిగే చైర్మన్ ఎన్నికలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార పార్టీ ప్రజా తీర్పును శిరసావహించడం లేదని ప్రజలు తమకు పూర్తి మెజారిటీ అందించినా దొడ్డిదారిన చైర్మన్ పదవిని చేపట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
