Delhi | ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. బీజేపీ తరఫున ప్రచారం !
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
కాగా, ఢిల్లీలోని తన అధికారిక నివాసం 1 జన్ పథ్ కు వెళ్లిన చంద్రబాబు… అక్కడ్నించి ఎన్నికల ప్రచారానికి తరలి వెళ్లారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని… తెలుగు ప్రజలు బీజేపీకి ఏకగ్రీవంగా ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తన ప్రసంగంలో అధికార ఆప్ ను ఉద్దేశించి చంద్రబాబు ఘటు వ్యాఖ్యలు చేశారు. ఆప్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఆప్ ప్రభుత్వం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాగునీరు అందించడంలో ఆప్ విఫలమైందని, ఢిల్లీ దుర్గంధభరితంగా ఉందని దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ అమృత్ పథకం కింద స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని వివరించారు. యమునా నది ప్రక్షాళన మోదీ మాత్రమే చేయగలరని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందన్నారు. మనకు కావాల్సింది ప్యాలెస్ లు కట్టుకునే వాళ్లు కాదు… ప్రజల కోసం పాటుపడే వాళ్లు అని అన్నారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీ గెలవాలి… ఇక్కడ పోటీ చేస్తున్న సంజయ్ గోయల్ గెలిపించాలన్నారు.