CITY | క్రిస్మస్ జోష్

CITY | క్రిస్మస్ జోష్
- నగరంలో ప్రారంభమైన క్రిస్మస్ సందడి
- సర్వాంగ సుందరంగా చర్చిలు ముస్తాబు
- ధగధగలాడుతున్న స్టార్లు
- జోరుగా క్రిస్మస్ ట్రీ స్టార్స్ అమ్మకాలు
- సందడిగా సెమీ క్రిస్మస్ వేడుకలు
- శాంతా క్లాస్ దుస్తుల కొనుగోలు
- ముందే వచ్చిన క్రిస్మస్ శోభ
CITY | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : మరో 8 రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుంది. అయితే జిల్లాకు ముందుగానే క్రిస్మస్ సందడి రానే వచ్చింది. క్రిస్మస్ జోష్ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చర్చీలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. దీపాలంకరణలు, రంగురంగుల స్టార్స్తో విద్యుత్ దీపాలు కనువిందులు చేస్తున్నాయి. ఒకవైపు జోరుగా శాంతా క్లాస్ దుస్తులు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జరుగుతున్నాయి.

జోరుగా విక్రయాలు…
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని వ్యాపార కేంద్రాలు హోల్సేల్ మార్కెట్లలో క్రిస్మస్కు సంబంధించిన వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మరి ముఖ్యంగా బందరు రోడ్డుపై పలు ప్రాంతాలలో శాంతా క్లాస్, క్రిస్మస్ ట్రీలు, స్టార్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆకర్షణీయమైన కొవ్వొత్తులు పశువుల పాక సెట్టింగ్లతో పాటు ఇంటిని అలంకరించినందుకు వినూత్నమైన తోరణాలను కొనుగోలు చేస్తున్నారు.

సెమీ క్రిస్మస్ల సందడి..
ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ మరో వారం రోజుల్లో రానున్న నేపథ్యంలో ముందుగా క్రైస్తవులు అత్యంత సందడిగా సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. చర్చీల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఏసుక్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని గుర్తు చేసే విధంగా నక్షత్రాలతో కూడిన అలంకరణలను సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. చర్చీల ముస్తాబు డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. పలు చర్చీలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగరంలోని ప్రధాన చర్చీ ప్రాంగణాలు రంగులతో అలంకరించారు.


