Chittoru | గ్రంథాలయాల నిరసన..

Chittoru | గ్రంథాలయాల నిరసన..

Chittoru, ఆంధ్రప్రభ – ఒకప్పుడు విజ్ఞాన దీపాలుగా, జ్ఞానాన్ని పంచే కేంద్రాలుగా పేరు గాంచిన ప్రభుత్వ గ్రంథాలయాలు నేడు నిధుల కొరతతో అల్లాడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న ఈ ప్రజా గ్రంథాలయాల్లో చాలా వాటిలో కనీసం వార్తాపత్రికలు వేయించడానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో, వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. గ్రంథాలయాలు మౌలిక సదుపాయాలు లేక, పుస్తకాల కొరతతో రోజురోజుకీ వెలవెలబోతున్నాయి. విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పాఠకులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొత్త గ్రంథాలయ భవనాల నిర్మాణం గానీ, ఉన్న వాటికి మరమ్మతులు గానీ ప్రభుత్వం చేయడం లేదు. సిబ్బంది జీతాలు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను స్థానిక సంస్థల నుంచి వచ్చే ఆదాయంతోనే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల, గ్రంథాలయాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.

జిల్లా కేంద్రమైన చిత్తూరులో (Chittoru) జిల్లా గ్రంధాలయ సంస్థకు సొంత భవనం కూడా లేదు. ఇది వరకు ఎన్జీవో హోం పక్కన ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని రోడ్డు వెడల్పు చేయడానికి కూల్చివేశారు. గత రెండు సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయం సంస్థ అద్దె భవనంలో చిత్తూరు మిట్టూరులోని రాఘవ థియేటర్ ఎదురుగా మిద్దె పైన నడుస్తోంది. గ్రంథాలయం మిద్దె పైన ఉండడంతో వికలాంగులు, వృద్ధులు గ్రంథాలయానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో చిత్తూరు పట్టణంలో పాత గ్రంథాలయ సంస్థ స్థలంలోని కొత్తగా గ్రంధాలయాన్ని భవనాన్ని నిర్మించడానికి మూడు కోట్ల రూపాయలతో విశాలంగా జిల్లా గ్రంధాలయ నిర్మాణం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 71 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో 54 గ్రంథాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 12 గ్రంథాలయాలు అద్దె లేని ఉచిత భవనాల్లో నడుస్తున్నాయి. ఐదు గ్రంథాలయాలకు అద్దె కడుతున్నారు. జిల్లా గ్రంధాలయాలకు స్థానిక సంస్థల సెస్ ముఖ్యమైన ఆదాయం. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు సెస్ వసూలు చేసే పన్నులలో 8 శాతం జిల్లా గ్రంథాలయాలకు అందజేయాలి.

పలువురు గ్రంధాలయ సెస్ ను వసూలు చేయడానికి ముందుకు రావడం లేదు. మరికొన్ని స్థానిక సంస్థలు వసూలు చేసినా, జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించడం లేదు. చిత్తూరు జిల్లాలో 32 కోట్ల రూపాయలు జిల్లా గ్రంధాలయ సంస్థకు స్థానిక సంస్థలు బకాయిలుగా ఉన్నాయి. తిరుపతి (Tirupathi) మున్సిపాలిటీ మాత్రమే 28 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై జిల్లా గ్రంథాలయ అధికారులు పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా, కొంత మొత్తం మాత్రం చెల్లించారు. అలాగే స్థానిక సంస్థలు కూడా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రంధాలయ సేస్ బకాయిలుగా ఉన్నాయి. సగటున ప్రతి సంవత్సరం ఐదు కోట్ల రూపాయలు గ్రంథాలయ సెస్ గా వసూలు కావాల్సి ఉంది. వీటి మీద ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ.. ప్రత్యేకమైన శ్రద్ధ చూపకపోవడంతో గ్రంథాలయ సెస్ఎక్కడికక్కడే పేరుకు పోతుంది. ఫలితంగా గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది.

కొత్త పుస్తకాలు కూడా కొనడానికి కుదరడం లేదు. 2007 సంవత్సరం నుంచి గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలను కొనలేదు. 2021 వ సంవత్సరం మాత్రం కొత్త పుస్తకాల కొనుగోలుకు కోటి రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత ఇప్పటి వరకు కొత్త పుస్తకాలు ఊసే లేదు. 23 సంవత్సరాలుగా కొత్త పుస్తకాలను కొనుగోలు చేయకపోవడంతో ఉన్న పాత పుస్తకాలతోనే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. గ్రంథాలయాలకు దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికల బిల్లులను చెల్లించడం కూడా కష్టమైపోతుంది. జిల్లాలోని 71 గ్రంథాలయాలకు 116 మంది ఉద్యోగులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే 70 పైగా గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి.

చిత్తూరు, మదనపల్లి, (Madhanapalli) తిరుపతిలో మాత్రమే గ్రంధాలయాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. జిల్లాలో ఈనెల 14వ తారీఖు నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయి. 14వ తారీఖున గ్రంథాలయ వారోత్సవాలను బాలల దినోత్సవం రోజున ప్రారంభిస్తారు. 15వ తేదీన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి, మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించి, పుస్తక పఠనం ప్రాధాన్యతను వివరిస్తారు. 16వ తేదీన గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించుకుంటారు. 17వ తేదీన కవి సమ్మేళనం జరగనుంది. 18 వ తేదీన సాహిత్య సదస్సు నిర్వహించనున్నారు. 19వ విద్యార్థినిలకు డ్యాన్స్ పోటీలను నిర్వహిస్తారు. 20వ తేదీన విద్యార్థులకు డిజిటల్ గ్రంథాలయాల పై అవగాహన సాముహిక పఠనం గురించి తెలియజేస్తూ వారోత్సవాలను ముగించనున్నారు.

Leave a Reply