ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బకనచర్ల ప్రాజెక్టుపై తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని జరుగుతున్న రాజకీయ విమర్శలకు గట్టి సమాధానం చెప్పారు. “పోరాటం కాదు – పరస్పర అవగాహన అవసరం” అని చంద్రబాబు పేర్కోన్నారు.
తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే అంత మంచిదే. వాటిని మేం అడ్డుకోవాలనుకోం, అంటూ చంద్రబాబు తెలిపారు. అయితే, “దిగువకు వచ్చే ప్రతి చుక్క నీరు మాదే” అని తెలిపారు.
కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుపై కూడా తమ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. అదే సమయంలో, బకనచర్ల విషయంలో రాజకీయంగా దుమారం రేపడం సమంజసమేమీ కాదని అన్నారు. బకనచర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి ముగింపు పలికేలా కనిపిస్తున్నాయి.