శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు… ర్యాంకులన్నీ మావేనని గొప్పలు పోయే కార్పొరేట్ విద్యాసంస్థలు చదువుల్లో దిట్టలను కొనుగోలు చేసి ర్యాంకుల పంటను పండించి.. వందల కోట్లు గడించడమే లక్ష్యంగా విద్యావ్యాపారం పరిఢవిల్లుతోంది. ఈ విద్య వ్యాపారంలో ఏపీలోని రెండు ప్రధాన సంస్థలు పోటీ పడి మరీ ర్యాంకర్ల కోసం ఊరూరా జల్లెడ పడుతున్నాయి. ఈ స్థితిలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఓ టెన్త్ విద్యార్థికి నారాయణ విద్యాసంస్థ కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ అంశంలో రెండు విద్యాసంస్థలు ఒకరిపై ఒకరు దమ్ము విసురుకుంటున్నాయో? లేక నిజంగానే ఆ విద్యార్థికి ఆఫర్ లభించిందా? అని పరిశీలిస్తే. ఆఫర్ నిజమే అన్నది స్పష్టమైంది. కానీ, ఆ విద్యార్థి తండ్రి ఈ ఆఫర్ని తిరస్కరించి.. కోటిన్నర ఇస్తనే నారాయణ విద్యాసంస్థలో చేర్చుతానని, లేకపోతే కుదరదని స్పష్టం చేశారని కదిరి పట్టణం కోడై కోస్తూంది..
గుడివాడలోనే టెన్త్ ఫ్యాక్టరీ
గతంలోనూ కదిరి ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులకు మహా గిరాకీ ఉండేది. ఇక్కడి విద్యార్థులను లక్షల రూపాయలతో కొనుగోలు చేసి, తమ కళాశాలలో చేర్చుకోవటం నారాయణ విద్యాసంస్థకు ఆనవాయితీగా మారింది. ఏటా కదిరి నుంచి 10 నుంచి 15 మంది ప్రతిభ గల విద్యార్థులను నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
ఔనా.. నిజమా? అని ప్రశ్నిస్తే..
కదిరి ప్రాంతంలోని సుమారు 10, 12 మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన సుమారు 500 మందికి పైగా విద్యార్థులు గుడివాడలోని విశ్వభారతి విద్యాసంస్థల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యార్థులు అత్యధికంగా చదువుతున్నారు. హిందూపురం, పుట్టపర్తి, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం తదితర పట్టణాల నుంచి కనీసం 500 పైగా విద్యార్థులు గుడివాడ విశ్వభారతిలో చేరుతున్నారు.
గుడివాడ విశ్వ భారతి విద్యాసంస్థలో ప్రవేశం పొందాలంటే అక్కడి అడ్మిషన్ టెస్ట్ రాయాలి. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అందులో ప్రవేశం కల్పిస్తారు. సానబట్టేది ఇక్కడే..ఏడవ, ఎనిమిదో తరగతి నుంచి ఎక్కు వమంది విద్యార్థులు విశ్వభారతిలో ప్రవేశం పొందుతుంటారు. ప్రవేశ పరీక్ష అనంతరం ర్యాంకు ఆధారంగా ఫీజు వసూలు చేస్తారు. ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి అన్ని ఫీజులు కలిపి దాదాపు మూడు లక్షల రూపాయలు పైగా ఉంటుంది. ఇదే సందర్భంలో విద్యార్థి ప్రతిభ ఆధారంగా అకడమిక్, ఫౌండేషన్, ఒలంపియాడ్, దీక్ష అనే నాలుగు విభాగాల్లో ఎంపిక చేస్తారు.
అందులోనూ ఒక్కొక్క విభాగంలో అనేక సెక్షన్లు ఉంటాయి. అకడమిక్లో ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో వస్తే ఫౌండేషన్కు ప్రమోట్ చేస్తారు. ఫౌండేషన్లో ప్రతిభ కనబరిస్తే ఒలంపియాడ్ కు, ఒలంపియాడ్ ల్లో ప్రతిభ కనబరిస్తే దీక్షకు ఎంపీక చేస్తారు. దీక్ష విభాగంలో టాప్లో ఉన్న విద్యార్థులంతా విశేష ప్రతిభగల విద్యార్థులే.
ఇలా దీక్ష విభాగంలో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలను, వారి చిరునామాలను నారాయణ విద్యాసంస్థల వీఆర్వోలు సేరకించి.. వారి ఇంటి ముందు వాలిపోవడం తంతుగా మారుతోంది. ఇట్లా వారి పేరెంట్స్కు ఆఫర్లు ఇచ్చి మరి తమ విద్యాసంస్థల్లో చేర్చుకుంటున్న తీరు స్పష్టమవుతోంది.
మంచి స్టూడెంట్స్కి ఆఫర్లే ఆఫర్లు..
లక్షల రూపాయలు వ్యయం చేసి, విద్యార్థులను కొనుగోలు చేసి తమ విద్యాసంస్థల్లో చేర్పించుకొని, జేఈఈ, ఎంసెట్, తదితర ప్రవేశ పరీక్షలలో ర్యాంకులు సాధించడం నారాయణ ప్లాన్గా మారింది. ఆ ర్యాంకులు వచ్చినప్పుడు ఫలానా పరీక్షల్లో నారాయణ విద్యాసంస్థల విజయ దుందుభి, ర్యాంకుల పంట పండింది. ముఖ్యంగా ఒకటి ఒకటి రెండు రెండు మూడు ఇలా మొదటి పది ర్యాంకుల్లో అన్ని ర్యాంకులు నారాయణ విద్యాసంస్థలవే అంటూ ఊదరగొట్టే యాడ్స్ వస్తూనే ఉంటాయి.
ఏదో చదువులో వెనకబడిన విద్యార్థులను తీర్చిదిద్ది ర్యాంకుల సాధిస్తే గొప్పగా చెప్పుకోవచ్చు. విశేష ప్రతిభ గల విద్యార్థులను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేసి, తామే గొప్పగా సాధించినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందనేది కొందరు తల్లిదండ్రుల వాదన. డిమాండ్ పెరిగింది..
సాధారణంగా ఇంజనీరింగ్, ఐఐటి వంటి కోర్సుల్లో ప్రతిభ కనబరిచి ప్రత్యేక గల విద్యార్థులకు ప్రసిద్ధి చెందిన కంపెనీలు ఏడాదికి ఇంత మొత్తం అంటూ ప్యాకేజీ ఇవ్వడం సహజం. కానీ, విద్యార్థి దశలోనే కేవలం పదో తరగతి పరీక్ష రాసిన ఫలితాలు కూడా వెలువడని సమయంలో విద్యార్థులకు లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చి తమ విద్యాసంస్థల్లో ప్రైవేటు విద్యా సంస్థలు చేర్చుకోవడం ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద విశేషం.
ఇందులో భాగంగానే కదిరికి చెందిన ఒక విద్యార్థికి నారాయణ విద్యాసంస్థల నుంచి ₹కోటి ఆఫర్ ఇచ్చి తమ విద్యాసంస్థలు ప్రవేశం తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇదే సమయంగా భావించిన విద్యార్థి తండ్రి కోటిన్నర డిమాండ్ చేసినట్లు కదిరి పట్టణం మార్మోగిపోతోంది. అడ్మిషన్లలో ఒకటికి మరోటి ఆఫర్..గతంలో ఇదే మాదిరిగా పలువురు విద్యార్థులకు ₹10 లక్షల నుంచి ₹ 20 లక్షల వరకు ఆఫర్లు ఇచ్చి విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకున్న కథలెన్నో ఉన్నాయి.
కొంతమంది ర్యాంకర్లు నగదు తీసుకోకుండా తమ బంధువుల పిల్లలకు ప్రవేశం ఇవ్వాలని కోరి.. ఆ మేరకు అడ్మిషన్లు ఇప్పించటం అలవాటుగా మారింది. ద్వితీయ శ్రేణి విభాగం విద్యార్థుల తల్లిదండ్రులే తమ బంధువుల బిడ్డలకు సీట్లు అడిగేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనేరీతిలో ఒకరు బాగా చదివితే మరొకరికి అడ్మిషన్ ఆఫర్లు ఇచ్చారని జనం ఇప్పుడు బాహటంగా చెప్పుకొంటున్నారు.