Bull Trading | షేర్ మార్కెట్ లో లాభాల పంట – ఇన్వెస్టర్ల జేబులోకి రూ.16 ల‌క్ష‌ల కోట్లు ..

ముంబ‌యి – భారత స్టాక్ మార్కెట్ నేడు భారీ లాభాలతో ముగిసింది.. నేడు ఒక్క రోజే సెన్సెక్స్ 2975 పాయింట్లు జంప్ చేసి 82,429.54 వద్ద ముగిసింది. ఇది 3.74% వృద్ధిని సూచిస్తుంది. ఇదే సమయంలో నిఫ్టీ 50 కూడా 872.9 పాయింట్లు 3.66% పెరిగి 24,830.75 వద్ద స్థిరపడింది. ఈ భారీ లాభాలు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మదుపర్లకు నేడు కొన్ని గంట‌ల‌లోనే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల లాభాలు చ‌వి చూశారు..

ఈ ర్యాలీ వెనుక కారణాలు

ఈ అసాధారణ ర్యాలీకి ప్రధాన కారణం భారత్-పాకిస్తాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం. వారాంతంలో కుదిరిన ఈ ఒప్పందం తర్వాత, భౌగోళిక రాజకీయ ఒత్తిడి తగ్గడంతో ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ సానుకూల వాతావరణం మార్కెట్‌లో బుల్లిష్ సెంటిమెంట్‌ను పెంచేలా చేసింది. అదనంగా, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒత్తిడి తగ్గడం, భారత్-అమెరికా మధ్య సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించిన ఊహాగానాలు మార్కెట్‌ను మరింత ఉత్తేజపరిచాయి.

ఈ రోజు లాభాల్లో ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ, ఆటోమొబైల్ సెక్టర్లు ప్రముఖంగా రాణించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 6.2% పెరిగి సెన్సెక్స్ ర్యాలీకి సపోర్ట్ చేసింది. దీంతోపాటు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ వంటి హెవీవెయిట్ స్టాక్స్ 4 నుంచి 5% లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 3.8% పెరిగి 55,200 స్థాయిని తాకింది, ఇదే సమయంలో పీఎస్‌యూ బ్యాంకులు కూడా రాణించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి స్టాక్స్ 5-7% లాభాలతో మెరిశాయి. టూరిజం, హాస్పిటాలిటీ స్టాక్స్ సీజ్‌ఫైర్ వార్తలతో 4-6% పెరిగాయి

Leave a Reply