హైదరబాద్ – పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనంతో మొదలైన బోనాలు ఈ లాల్ దర్వాజ బోనాలతో చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ లాల్దర్వాజ బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు, రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు, ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో లాల్దర్వాజ బోనాల జాతర నేటి తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఒక క్యూలైన్ ఉంది. అలాగే భక్తుల కోసం రెండు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
Also Read | All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు – మరి కాసేపట్లో అఖిలపక్షం భేటి
రేపు అమ్మవారి భవిష్యవాణి చెప్పే సంప్రదాయ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఒక మహిళ మట్టికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. సోమవారం సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్, ఢిల్లీ దర్వాజ వరకు ఘటాల ఊరేగింపు, పోతరాజు విన్యాసాలు జరగనున్నాయి. ఇవి కనులపండుగగా సాగుతాయి. అందుకే ప్రభుత్వం రేపు అధికారిక సెలవు ఇచ్చింది. సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడతాయి. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు.1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్తో ఆలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు లిక్కర్ షాపులు బంద్ .
బోనాల పండుగ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా పబ్బులు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలో సైతం మద్యం సరఫరాను ఆ ఒక్కరోజు నిలిపివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం, కల్లు విక్రయాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


Pingback: Bonalu | మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం - ఉప ముఖ్యమంత్రి భట్టి - Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News