న్యూ ఢిల్లీ : ఎయిర్ ఇండియా (Air India) కి ఒక కష్టం పోతే మరొక కష్టం వెంటాడుతూనే ఉంది. సరిగ్గా నిన్న మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల ప్రాంతంలో అహ్మదాబాద్ (Ahmedabad) లోని ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంకా అక్కడ పరిస్థితి కంట్రోల్ లోకి రాలేదు. ఎటు చూసినా విషాదఛాయలే.. ఇలాంటి ఘటన నుంచి ఇంకా కోలుకోక ముందే ఇంతలోనే పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది.
దీంతో ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ అలెర్ట్ అయింది. అంతేకాదు ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు కాల్ (Bomb threat call) రావడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అధికారులు. అందుతున్న వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా ఏఐ 379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. గాల్లో ఉన్న విమానాన్ని గాల్లోనే లేపేస్తామంటూ ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ (Thailand) లో విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. ఈ విమానంలో సుమారు 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. బెదిరింపు కాల్ అనంతరం ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి పూర్తిగా విమానాన్ని తనిఖీలు చేపట్టారు. అయితే విమానంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. దీంతో విమాన ప్రయాణానికి అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇవ్వడంతో అక్కడ నుంచి తిరిగి తన గమ్యస్థానానికి బయలుదేరింది.