హైదరాబాద్ – శ్రీరామనవమి పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు.. సీతారాముల కల్యాణోత్సం లో ఆయన పాల్గొంటారు.. ఆ తర్వాత ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తారు. ఇదే సందర్బంగా ఆయన అక్కడే సన్నబియ్యం లబ్దిదారుడి నివాసానికి వెళ్లి అక్కడే భోజనం చేయనున్నారు.
త్వరలోనే 30 లక్షల కొత్త రేషన్ కార్డులు
తెలంగాణలో ఉగాది పండుగ సందర్భంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిరోజు ఒక చోట సన్న బియ్యం ఇవ్వడాన్ని ప్రారంభిస్తున్నారు. నిన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ కూడా అక్కడే భోజనం చేశారు. అనంతరం మంత్రులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే 30లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్టు ప్రకటించారు. త్రివర్ణంలో బీపీఎల్ కార్డులు ఉండబోతున్నాయని తెలిపారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 1.10 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. లబ్దిదారుల ఇళ్లలో ప్రజా ప్రతినిధులు భోజనం చేయాలని సూచించారు.