ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో శనివారం కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.. వడగళ్ళ వానతో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు.
రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు.ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అకాల వర్షాల వలన ఏర్పడే నష్టాల అంచనాలను ఏప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాలన్నారు.