ATM| ఏటీఎం చోరి.. అసలు ఏం జరిగింది..?
- గుడిపాలలో ప్రత్యక్షమైన ఏటీఎం దోపిడీ కారు
- మూతబడిన పెట్రోల్ బంకు దగ్గర వదిలి పారిపోయిన దొంగలు
- ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- కారును స్వాధీనం చేసుకుని చుట్టుపక్కల గాలిస్తున్న కర్ణాటక పోలీసులు
- తిరుపతికి పారిపోయినట్లు పోలీసుల అనుమానం
- అప్రమత్తమైన చిత్తూరు పోలీసులు గాలింపు ప్రారంభం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : బెంగళూరులో ఏటీఎంలలో నగదు నింపేందుకు వెళుతున్న వాహనాన్ని ఆపి పట్టపగలు దోపిడీ చేసిన దొంగలు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. బెంగళూరులో దోపిడీకి ఉపయోగించిన ఇన్నోవా కారును గుడిపాల మండలం 180 రామాపురం దగ్గర మూతపడిన మారుతి పెట్రోలియం పంపు దగ్గర వదిలి పారిపోయినట్లు తెలిసింది. దీంతో కర్ణాటక పోలీసులు అప్రమత్తమై దోపిడి దొంగలను గాలిస్తూ గుడిపాల మండలంలోకి వచ్చారు. వారికి 180 రామాపురం వద్ద ఆపిన వాహనం కనిపించింది. వాహనంలో నగదు గాని, వ్యక్తులు గాని లేరు. చుట్టుపక్కల గాలించి ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని బెంగళూరుకు తీసుకెళ్లి ఇంటరాగేషన్ చేస్తున్నట్లు తెలిసింది. దోపిడీ దొంగలు కారును గుడిపాల మండలంలో వదిలి నగదుతో సహా తిరుపతికి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటక పోలీసులు గుడిపాల మండలంలో నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలలో నింపేందుకు తరలిస్తున్న రూ.7.11 కోట్ల నగదుతో ఉన్న వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. నిందితులు తప్పించుకోకుండా నగర సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. సౌత్ ఎండ్ సర్కిల్ వద్ద సీఎంఎస్ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నోవా కారులో వచ్చిన 7-8 మంది దుండగులు, తాము ఆర్బీఐ అధికారులమంటూ సిబ్బందిని బెదిరించారు. వాహనంలోని గన్మన్లు, ఇతర సిబ్బందిని కిందకు దించి, డ్రైవర్ను మాత్రం వాహనంలోనే ఉంచి డెయిరీ సర్కిల్ వైపు తీసుకెళ్లారు. డెయిరీ సర్కిల్ ఫ్లైఓవర్ పై వాహనాన్ని ఆపి, అందులోని నగదును తమ ఇన్నోవా కారులోకి మార్చుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
దోపిడీకి ఉపయోగించిన ఇన్నోవా కారుకు నకిలీ నంబర్ ప్లేట్ (KA 03 NC 8052) ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నంబర్ వాస్తవానికి కల్యాణ్ నగర్కు చెందిన స్విఫ్ట్ కారుదని తేలింది. ఈ ఘటన పై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన 45 నిమిషాల నుంచి గంట ఆలస్యంగా సిబ్బంది సమాచారం ఇవ్వడం, గన్మన్లు తమ ఆయుధాలను ఎందుకు ఉపయోగించలేదనే అంశాల పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంఎస్ సిబ్బంది ప్రమేయం ఉండొచ్చనే కోణంలోనూ విచారిస్తున్నారు.
డ్రైవర్, ఇద్దరు గన్మన్లు సహా నలుగురు సిబ్బందిని సిద్దాపుర పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. పక్కా ప్రణాళికతోనే సీసీటీవీ కెమెరాలు లేని, రద్దీగా ఉండే డెయిరీ సర్కిల్ ఫ్లైఓవర్ను దోపిడీకి ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీదారిలో ఉపయోగించిన ఇన్నోవా కారు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. దీంతో చిత్తూరు జిల్లాలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు డిఎస్పి సాయినాథ్, చిత్తూరు వెస్ట్ సిఐ శ్రీధర్ నేతృత్వంలో గుడిపాల, చిత్తూరు పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు.

