- జిల్లా మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి, ఎన్ ఎం డి ఫరూక్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్… రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సరఫరా చేయాల్సిన తాగునీటి సరఫరాపై శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… జిల్లాలో త్రాగునీటి ఎద్దడిని నివారించడానికి, నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తాగునీటి సమస్యలకు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాబోయే వేసవి కాలంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా అధికారులు చూడాలన్నారు. వేసవిలో ఒక్కోసారి సడన్ గా భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకు ముందుగానే ప్రత్యామ్నయం చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుదన్నారు.
అలా ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక రెండు రోజుల్లో పరిష్కరించవచ్చన్నారు. నీటి ఎద్దడి వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగుల అశ్రద్ధ అలసత్వం వహిస్తే, ప్రజలు ఇబ్బంది పడితే అంతిమంగా అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతుందన్నారు.
జిల్లాలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి ఉందని మీడియాలో రావడం కంటే ముందే అధికారులు స్పందించాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను క్షేత్రస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి ఆయా సమస్యలను పరిష్కరిద్దామన్నారు.
ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి.
జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ.. 489 గ్రామపంచాయతీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి రిజర్వాయర్లో నిల్వలో ఉన్న నీటి లభ్యతను బట్టి పబ్లిక్ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులతో ప్రణాళిక సిద్దం చేసుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపుకోవాలన్నారు.
2.5 లక్షల ఎకరాలకు రైతులకు సాగునీటిని అందించే క్రమంలో నీటి కొరత లేకుండా వారబంధి పద్ధతిలో నీతిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో దాదాపు 25 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఇంకిపోయాయని నీటి వనరులను అన్వేషించి తాత్కాలిక నీటి సరఫరాపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
ఈ సమావేశంలో న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు చరితరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్ఓ రామునాయక్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.