మోటకట్ల వద్ద రెండు కార్లు ఢీ
మరో నలుగురికి గాయాలు
సంతాపం తెలిపిన చంద్రబాబు
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మోటకట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో హంద్రీనీవా యూనిట్-2 పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రమ (50) దుర్మరణం పాలయ్యారు.. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.. పీలేరు నుండి రాయచోటి కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది..
చంద్రబాబు సంతాపం …
రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కు హాజరయ్యేందుకు వెళ్తుండగా సంబేపల్లె మండలం యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రమ మృతి దురదృష్టకరం అన్నారు.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో నలుగురికి అత్యవసర వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు..
నారా లోకేష్ దిగ్ర్భాంతి ..
ఈ సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.. వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కన్నీటి నివాళి అర్పిస్తున్నాను.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత యంత్రాంగాన్ని కోరుతున్నాను.. వారంతా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
మంత్రి రాంప్రసాద్ సంతాపం ..
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ.. అన్నమయ్య జిల్లా యర్రగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.. గ్రీవెన్స్ కు వెళ్తూ ప్రమాదంలో హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్ రమ మృతి చెందటం బాధాకరం అన్నారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యులు సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడి ఆరా తీసి.. డిప్యూటీ కలెక్టర్ రమ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. కాగా, రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా మృతదేహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి… రోడ్డు ప్రమాదం పై ఆరా తీశారు.. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించిన జిల్లా కలెక్టర్.