మంగళగిరి : రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నేడు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మీ దంపతులకు ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో పేదల దశాబ్దాల కల నెరవేరింది. పేదలకు పట్టాభిషేకం ప్రారంభమైంది. మొదటి విడత లో శాశ్వత హక్కు కల్పిస్తూ 3 వేల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాను. ఉండవల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు మొదటి పట్టా అందజేసాను. రాజమండ్రి గోవిందు, సీతామహాలక్ష్మి అనే దంపతులు ఇద్దరు బిడ్డలతో ఉండవల్లిలో నివాసం ఉంటున్నారు. ఏళ్ల క్రితం ఉండవల్లి అమరారెడ్డి నగర్ లోని కొండ పోరంబోకు స్థలంలో వారు చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. రజక కులానికి చెందిన గోవిందు డ్రైవర్ గా పనిచేస్తుండగా, భార్య సీతామహాలక్ష్మి బట్టలు ఉతకడం, ఇస్త్రీ పనిచేసి బిడ్డలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాము ఉంటున్న స్థలానికి పట్టా ఇప్పించాలని గతంలో వారు ఎందరో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లోనే దశాబ్దాల సమస్యను పరిష్కరించాం. ఇచ్చిన హామీ మేరకు నేరుగా వారి ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేసాను. పట్టా అందుకున్న కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం మాటల్లో వివరించలేను అని అన్నారు..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10నెలల్లో మంగళగిరిలో తొలి పట్టాకు శ్రీకారం చుట్టామన్నారు. లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇళ్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు 10 నెలల్లో మూయించామని తెలిపారు. మూడు దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తొలిదశలో 3 వేల మందికి మంగళగిరిలోనే ఇళ్ల పట్టాలు, బట్టలు పెట్టి మరీ అందిస్తున్నామన్నారు. అధికారంలో లేనప్పుడే సొంత ఖర్చులతో 26 సంక్షేమ పథకాలు అందచేశామన్నారు. స్వచ్ఛ మంగళగిరి పేరిట స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల మంత్రివర్గంలో ఆమోదం పొందిన 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో 50కి పైగా పథకాలు మంగళగిరిలో అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో మంగళగిరిని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కృషి చేస్తున్నానని తెలిపారు.
అందులో వైసీపీ ఆరితేరింది
రెడ్ బుక్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముంది మంత్రి ప్రశ్నించారు. చట్టవిరుద్దంగా పని చేసిన వారిని రెడ్ బుక్లో చేర్చుతామని నాడు చెప్పా.. ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి తిరిగి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండె పోటు వస్తే మరొకరు చెయ్యి విరకొట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కుట్రల పట్ల ప్రభుత్వంతో ప్రజలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కుల, మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడంలో వైసీపీ నేతలు ఆరితేరారని మండిపడ్డారు. అందుకే ఫాస్టర్ ప్రవీణ్ మరణం దర్యాప్తుపై ఆయన కుటుంబసభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నా, వైసీపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని కుట్రలకు ఆ పార్టీ వెనుకాడదన్నారు. సొంత తల్లి, చెల్లికి సమాధానం చెప్పుకోలేని జగన్ ఇక ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించారు. విజనరీ, పిజనరీకి తేడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. విజనరీ భవిష్యత్తు తరాలు గురించి ఆలోచించి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తారన్నారు. నాడు కంప్యూటర్లు అన్నం పెడతాయా అని విమర్శించిన వాళ్ళు ఉన్నారని అన్నారు. 90వ దశకంలో చంద్రబాబు ఏం చేశారో ఇప్పుడు చాలా మంది సమీక్షిస్తున్నారన్నారు. పీజనరీ చూపు ఎప్పుడు జైలు వైపు, విధ్వంసం వైపే ఉంటుంది కాబట్టి పీ4 ఫలాలు తెలియవంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేశారు.