విజయవాడ, ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగిసింది. దీంతో ఈరోజు ఉదయం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య,పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపర్చారు. వీరికి ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ విధించింది. ఇక కేసులో దర్యాప్తు పురోగతి తెలియజేయటం లేదని నిందితుల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
దీనిపై స్పందించిన కోర్టు.. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగింపుతో పాటు దర్యాప్తు పురోగతిని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు. దీనిపై రేపు (బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది.