అమరావతి, మార్చి 10 :- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూకేటాయింపుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది.
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్, మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్ సమావేశానికి హాజరయ్యారు.
భేటీ అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. “గతంలో 131 మందికి భూములు కేటాయించాం. వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. రెండు సంస్థలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట కేటాయింపులు చేయాలని నిర్ణయించాం. 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధిని మార్చాం” అని మంత్రి తెలిపారు.
ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారు : మంత్రి పయ్యావుల కేశవ్
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ “అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టు. మెజారిటీ నిధులను సీఆర్డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతే. అదికూడా బయట సంస్థల ద్వారా రుణాల రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నాం. అమరావతి నిర్మాణంలో భాగంగా ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందిన తర్వాత భూములను అమ్మేసి అప్పులన్నీ కట్టే విధంగా డిజైన్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రాజధాని కట్టాలంటే రూ. లక్షల కోట్లు కావాలని మాజీ సీఎం జగన్ గతంలో అన్నారు.
రూ. లక్షల కోట్లు ఏమైనా మేం ఖర్చు చేస్తున్నామా? లేదు కదా. సీఆర్డీఏ ద్వారా నిధుల సమీకరణ జరుగుతోంది. సీఆర్డీఏ ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన తర్వాత సీఆర్డీఏనే రుణాలు తీర్చేస్తుంది. ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారు. వారి జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఇతర జిల్లాల అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు వీలుండేది” అని పయ్యావుల పేర్కొన్నారు.