- వారికి డోర్ డెలివరీ
- ఎండీయూ వ్యాన్లు రద్దు
- నిఘా నీడలో రేషన్ షాపులు
రేషన్ బియ్యం పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీపై కీలక వివరాలను వెల్లడించారు. జూన్ 1 నుంచి చౌకధరల దుకాణాల్లో మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 9,260 రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 66 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.
ఇంటింటికీ రేషన్ బియ్యం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. 9,269 ఎండీయూ వాహనాలకు రూ.1800 కోట్లు ఖర్చు చేశారని.. దీని కోసం ట్రయల్ ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చు చేశారని.. ఎక్కడా ఆశించిన ఫలితాలు సాధించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 30శాతం మందికి రేషన్ బియ్యం అందలేదని మంత్రి విమర్శించారు.
అయినప్పటికీ, ఎండీయూ వాహనాలను ఆయా వ్యాన్ ఆపరేటర్లకు ఉచితంగా బదలాయిస్తామని మంత్రి తెలిపారు. వారి జీవనాధారంపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. దీనివల్ల రేషన్ అక్రమ తరలింపును అరికట్టవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ వ్యాన్లను గూడ్స్ డెలివరీకి లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇక రేషన్ పంపిణీని సక్రమంగా పర్యవేక్షించడానికి ఒక కొత్త యాప్ను రూపొందించినట్టు తెలిపారు. రేషన్ దుకాణాలలో పారదర్శకతను నిర్ధారించడానికి, వాటిని నిఘాలో ఉంచడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.