వెలగపూడి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటలిజెన్స్ మాజీ చీఫ్, ఐఏఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. విజయవాడ పోలీసులు ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకొన్నారు. ముంబై నటి, మోడల్ కాందాంబరి జెత్వానీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్టు చేయలేదని గతంలోనే హైకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారిగా గతంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బేగంపేటలోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు నేటి ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు

గత ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసం నుంచి పోలీసులు ఏపీకి తరలిస్తున్నారు. జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులుని విచారించనున్నారు. నటి జెత్వానీ తప్పుడు ఆరోపణలపై అరెస్టు, వేధింపులకు పాల్పడినందుకు సస్పెండ్ చేయబడిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరు.
మరోవైపు ఇదే కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీ కూడా నిందుతులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆంజనేయులు మాత్రం ఇప్పటివరకూ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోలేదు.
కాగా గత ఆగస్టులో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబుకు జెత్వానీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరిలో తనపై ఫోర్జరీ, దోపిడీ కేసు నమోదు చేసిన రాజకీయ నేత, సినీ నిర్మాత కేవీఆర్ విద్యాసాగర్తో అధికారులు కుట్ర పన్నారని ఆరోపించారు. సీనియర్ పోలీసు అధికారులు విద్యాసాగర్తో కుమ్మక్కై తనను, తన కుటుంబాన్ని వేధించారని, ముందస్తు నోటీసు లేకుండా అరెస్టు చేశారని, ముంబై నుంచి విజయవాడకు తీసుకువచ్చారని జెత్వానీ ఆరోపించారు. తనను, తన తల్లిదండ్రులను తీవ్రంగా అవమానించారని, చట్టవిరుద్ధంగా నిర్బంధించారని 40 రోజులకు పైగా జ్యుడీషియల్ కస్టడీలో ఉంచినట్లు పేర్కొన్నారు