దేశంలోనే అత్యధికంగా పించన్ లు ఇచ్చే రాష్ట్రం ఎపినే
ప్రతి నెల 64 లక్షల మందికి ఇంటి వద్దే పించన్ పంపిణీ
కోనసీమ జిల్లా చేయ్యేరు బహిరంగ సభలో చంద్రబాబు వెల్లడి
అమలాపురం – కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెన్షన్ల కోసం రూ.34 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు . పేదలకు ఎప్పటికప్పుడు పెన్షన్లను పెంచిన ఘనత టీడీపీ కే దక్కుతుందన్నారు. మూడు నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లలో అదనంగా 9,176 మందికి ఇచ్చామని తెలిపారు. దేశంలో ఉన్న మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదని సీఎం చెప్పారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు స్వయంగా నేడు పింఛన్లు అందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, చెయ్యేరులో ఉపాధి హామీ శ్రామికులు రత్నం, మరియమ్మకు పెన్షన్లు అందజేసిన సీఎం చంద్రబాబు అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు.

ఇదే సందర్బంగా డయాబెటీస్ తో కాలు కోల్పోయిన పోలిశెట్టి దుర్గాప్రసాద్ తనకు వచ్చిన సమస్యను చంద్రబాబుకు దృష్టి తెచ్చారు.. కళాశాలలో ఫీజు కట్టకపోవడంతో కుమార్తెకు సర్టిఫికెట్లు అందలేదని వివరించారు.. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సర్టిఫికెట్లు తీసుకుని ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. అలాగే దుర్గాప్రసాద్ కు ఈ నెల నుంచే పెన్షన్ మంజూరు చేస్తున్నానని తెలిపారు.
అనంతరం చెయ్యేరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..పెన్షన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామన్న ఆయన.. ప్రతినెలా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులతో పాటే 64 లక్షల మంది పెన్షన్ దారులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం పెన్షన్లు పంపిణీ చేయడం పూర్తయిందని తెలిపారు. కొందరికి వారు పనిచేసే చోటే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం వితంతు పింఛన్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. కూటమి సర్కార్ హయాంలో 71,380 మందికి వితంతు పింఛన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దివ్యాంగులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 16,347 పోస్టులతో త్వరలోనే అందరికీ ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. ఫైల్ పై మొదటి సంతకం చేశానని, దానిని అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు.