- మూడు కీలక శంకుస్థాపన కార్యక్రమాలు
- పూర్తి షెడ్యూల్ ఇదే
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు (జూన్ 26న) రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడే మూడు ప్రధాన శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
పర్యటన షెడ్యూల్ :
పవన్ కళ్యాణ్ ఉదయం 9:30 గంటలకు మధురపూడి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆయనకు స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలుకనున్నారు.
ఉదయం 10:00 గంటలకు గోదావరి తీర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి నాంది పలుకుతూ పవన్ కళ్యాణ్ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యాటక ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ సంపద, సంస్కృతి ప్రోత్సాహంతో పాటు ఉద్యోగావకాశాలు కూడా పెరగనున్నాయి.
అనంతరం ఉదయం 11:00 గంటలకు విద్యార్థులలో శాస్త్ర విభాగంపై ఆసక్తి పెంపొందించేందుకు బొమ్మూరులో సైన్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం 12:40 గంటలకు పర్యావరణ పరిరక్షణ, అరణ్య శిక్షణకు తోడ్పడేలా దీవాన్ చెరువు వద్ద ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు శంకుస్థాపన చేపట్టనున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈ అకాడమీ రాష్ట్రంలో అడవుల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కీలకంగా నిలవనుంది.
భద్రత కట్టుదిట్టం !
పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసు విభాగం పూర్తి భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు ఈ కార్యక్రమాలకు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా, నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే ప్రజలు కదలాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.