అనకాపల్లి జిల్లా కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు… ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని ఆయన ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని, వారు ధైర్యంగా ఉండాలని సీఎం అన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి తిరిగి నివేదించాలని అధికారులను ఆదేశించారు.
బాధితులకు అండటా ఉంటాం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున ప్రమాదంపై ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రమాదంలో కార్మికులు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందన్నారు. బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకొంటుందని తెలిపారు.
8కి చేరిన మృతుల సంఖ్య..
కోటవురట్లలోని బాణసంచా తయారీ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మొదట ఐదుగురు కార్మికులు మరణించారని వార్తలు వచ్చాయి. తరువాత, మరో ముగ్గురు కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితులందరూ కాకినాడ జిల్లాలోని సామర్లకోట నివాసితులుగా గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 15 మంది కార్మికులు ఉన్నారు. మృతులను టాటాబాబు (50), గోవింద (45), రామలక్ష్మి (38), నిర్మల (36), పురం పాప (40), బాబు (40), బాబురావు (56), మనోహర్గా గుర్తించారు.
కాగా, అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్నిప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ.15లక్షలు చొప్పున బాధితుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.