గత ప్రభుత్వం వల్లే భూ వివాదాలు పెరిగాయని విమర్శ
తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీల పెండింగ్పై సీరియస్
శాఖలో భారీ మార్పులు, టెక్నాలజీ వాడకంపై దృష్టి
అధికారులకు చంద్రబాబు దిశ నిర్ధేశం
వెలగపూడి – రెవెన్యూ శాఖ (Revenue Department ) పనితీరుపై సీఎం చంద్రబాబు (CM Chandra babu ) తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం (Fire ) వ్యక్తం చేశారు. భూ సమస్యల (Land Issues ) పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై నేడు నిర్వహించిన కీలక సమీక్ష (Review ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ శాఖ పనితీరు సంతృప్తిగా లేదని తేల్చి చెప్పారు.
గత పాలకుల వైఫల్యాల కారణంగానే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ వివాదాలు, సర్వే సమస్యలు తీవ్రమయ్యాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో అర్జీలు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత రావాలంటే భూ సమస్యలను వేగంగా పరిష్కరించడం, సేవలను సులభతరం చేయడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
మహానాడులో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోగా భూ సమస్యలను పరిష్కరించి తీరుతామని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు. కేవలం పైపైన మార్పులు కాకుండా, క్షేత్రస్థాయి నుంచి రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేస్తే తప్ప ఫలితాలు రావని అన్నారు. సిబ్బంది కొరత, పనిభారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని సూచించారు.
పని తీరును మెరుగు పరుచుకుంటే ప్రజలకు మరింత చేరువవ్వాలని అధికారులను కోరారు.. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పేరుకు పోయిన ఫైళ్లకు మోక్షం కలిగించాలని అన్నారు.. అలాగే పరిశీలనకు వచ్చిన ప్రతి ఫైల్ ను వేగంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపాలని సూచించారు.