- గండ్లు పూడ్చివేత కు త్వరలో టెండర్లు
బుడమేరు ఆధునీకరణకు సంబంధించి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుడమేరు 3 గండ్లు మరమ్మత్తుల కోసం కేబినెట్ ఆమోదించిన రూ.39.05 కోట్లతో, త్వరలోనే టెండర్లు పిలిచి, పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
గత టిడిపి హాయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ 37,500 క్యూసెక్కులకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80 శాతం పనులు పూర్తి చేసిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకు నిధులు ఉన్నా, మిగిలిన 20శాతం పనులు చేయలేదని ఆయన విమర్శించారు.
ఎనికేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్ళే ఛానల్ విస్తరణ పనులను వైసిపి ప్రభుత్వం రద్దు చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అన్నారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కుల వరద నీటిని తీసుకెళ్లాలా సామర్థ్యం పెంచి , పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయమని అధికారులకు సూచించారు.
వెలగలేరు రెగ్యులేటర్ నుండి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్ద్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి తగు సూచనలు ఇచ్చారు. బుడమేరు ఓల్డ్ ఛానెల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానెల్ ను కూడా 10వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి తయారు చేసిన ప్రతిపాదనలు, ప్రణాళికల పై చర్చించారు.
బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మానేజ్మెంట్ కింద, కేంద్ర సాయంతో ముందుకు వెళ్ళేలా ప్రతిపాదన పై కూడా క్షుణ్ణంగా సమీక్షించారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మానేజ్మెంట్ శాఖల్ని సమన్వయం చేసి సదరు ప్రత్తిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయిప్రసాద్, ఈఎన్సి వెంకటేశ్వరరావు, సీఈలు, ఎస్ఈ లు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.