రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ పట్టం..

రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ పట్టం..
రూ. 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఉత్తర్వులు
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు విలువైన చేయూత
సీఎం నిత్యనూతనం-వినూత్నం నినాదానికి అనుగుణంగా అడుగులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : స్వర్ణాంధ్ర విజన్ @ 2047, వికసిత్ భారత్ సాకారం దిశగా చేస్తున్న వినూత్న ప్రయత్నాల్లో భాగంగా ఆకాంక్షిత బ్లాకు అయిన ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జిల్లా యంత్రాంగంఏర్పాటు చేసిన రూరల్ ఇన్నొవేషన్స్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ కేంద్రానికి నీతి ఆయోగ్ పట్టంకట్టిందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు రూ. 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులిచ్చినట్లు వెల్లడించారు.

రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ ఆర్థిక మద్దతుపై కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి శనివారం కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గౌరవ సీఎం ఆకాంక్ష అయిన ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసి వినూత్నంగా రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.

రైజ్ కేంద్రం ప్రణాళికపై నీతి ఆయోగ్కు సవివర నివేదిక పంపగా పరిశీలించి ఆర్థిక మద్దతుకు ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ నిధులు ఇబ్రహీంపట్నం బ్లాకులో ఏఐ ఆధారిత నైపుణ్య సర్వే, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ మద్దతు మండలంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్ద చేయూత అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.

..ఏఐ సహా విభిన్న అంశాల్లో శిక్షణ..
ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్న నిత్య నూతనం – వినూత్నం నినాదానికి అనుగుణంగా మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా టీమ్ ఎన్టీర్ కృషిచేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రైజ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్, ఐడియా డెస్క్, స్కిల్లింగ్ డెస్క్, ప్లేస్మెంట్ డెస్క్, బ్యాంకింగ్ డెస్క్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని రకాల సేవలు ఒకేచోట అందేలా రైజ్ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రైజ్ కేంద్రంలో ఇప్పటికే వెయ్యిమందికి పైగా మహిళలకు ఏఐ, స్పోకెన్ ఇంగ్లిష్, పేపర్ క్రాఫ్ట్స్, కార్ డ్రైవింగ్, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్ ప్యానెల్ ఫిక్సింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), ఏ2 ఘీ వంటి వాటిపై వర్క్షాప్లు కూడా నిర్వహించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా ప్రభుత్వ పథకాలను, రైజ్ కార్యాచరణను సద్వినియోగం చేసుకొని 300 కుటుంబాలకు పైగా ఇప్పటికే వివిధ యూనిట్లు ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారన్నారు. రైజ్ కేంద్రంలో విభిన్న అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని.. ప్రతివారం వివిధ అంశాల్లో వర్క్షాప్లు సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు మహిళలను క్షేత్ర పర్యటనలకు కూడా తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అలీప్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టీఐహెచ్ తదితరాలతో కూడా చేతులు కలిపామన్నారు. రైజ్ కేంద్రంలో ప్రతినెలా ఎన్టీఆర్ వికాస ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా విజయానికి సహకరించిన ముఖ్యమంత్రి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, సెర్ప్ అధికారులు, మీడియా ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రైజ్ను సద్వినియోగం చేసుకోవాలనుకునే ఔత్సాహికులు 70753 85588 నంబరులో సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో డి.శకుంతల, ఏబీపీ బ్లాక్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్, రైజ్ మేనేజర్ బి.తేజస్విని పాల్గొన్నారు.
