వెలగపూడి – ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీ లాంచ్ పనులకు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వ ఆహ్వానం పంపించింది. అమరావతి రీ లాంచ్ పనుల ప్రారంభోత్సవం కోసం ఈ నెల రెండో తేదీన ముహుర్తం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతి పనులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతోంది.
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ పనులను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం సంకల్పిచింది. ఇందులో భాగంగానే మే 2వ తేదీన జరుగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఆహ్వానపత్రికను పంపించింది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ప్రొటోకాల్ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే జగన్ ఇంటి దగ్గర లేకపోవడంతో ఆయన పీఏ కే. నాగేశ్వరరెడ్డికి ఆహ్వాన పత్రికను ప్రోటోకాల్ అధికారులు అందించారు. గతంలో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి చంద్రబాబు ప్రభుత్వం ఆహ్వానం పంపించిన జగన్ మాత్రం రాలేదు. అయితే రేపటి కార్యక్రమానికి జగన్ వస్తారా రారా అనే విషయం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
Amarvati | మోడీ వస్తున్నారు… మీరూ రండి : జగన్ కు కూటమి సర్కార్ ఆహ్వానం
