అహ్మదాబాద్లో ఎయిరిండియా (Air India ) విమానం కుప్పకూలిన ఘటనలో మరో మృతదేహం (Dead body ) లభ్యమైంది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు శనివారం ఉదయం శిథిలాలను (debris ) తొలగిస్తుండగా విమానం తోక భాగంలో (Tail part ) ఈ మృతదేహాన్ని గుర్తించారు. తోక భాగాన్ని తొలగిస్తుండగా లభ్యమైన మృతదేహం విమాన సిబ్బందిలోని ఎయిర్హోస్టెస్దిగా (Air Hostess ) అధికారులు ధృవీకరించారు.
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస సముదాయంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానం చాలా వరకు మంటల్లో కాలిపోగా, తోక భాగం మాత్రం ఒక భవనంపై ఇరుక్కుపోయింది.
పైలట్ చివరి మాటలు
ప్రమాదానికి ముందు విమానం సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సభర్వాల్ చివరి ఐదు సెకన్ల ఆడియో సందేశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన “మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్” (అపాయం.. అపాయం.. అపాయం.. శక్తి లేదు.. ఒత్తిడి లేదు.. కిందకు పడిపోతున్నాం) అని అత్యంత ఆందోళనకరంగా చెప్పినట్లు రికార్డయింది. ఈ సందేశం అందిన వెంటనే విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది.