పాత సెల్ ఫోన్లు.. సిమ్ కార్డులతో భారీ స్కెచ్
ఆదిలాబాద్ పోలీసులకు చిక్కిన ఐదుగురు ముఠా
పరారీలో బిహారీ గ్యాంగ్ లీడర్
కర్ణాటకలో 10 వేల ఫోన్లు సేకరించి సైబర్ కుట్ర
2,125 పాత మొబైల్ ఫోన్లు, 600 బ్యాటరీలు..
107 సిమ్ కార్డులు స్వాధీనం
త్వరలో వివరాల వెల్లడి : ఎస్పీ అఖిల్ మహాజన్
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : పాత సెల్ ఫోన్లు, సిమ్ కార్డులను సేకరించి దేశవ్యాప్తంగా భారీ సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బీహార్ కు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలు, 107 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ కీలక సూత్రధారి, బిహారీ గ్యాంగ్ లీడర్ తబారక్ పరారీలో ఉన్నట్టు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. త్వరలోనే సైబర్ క్రైమ్ గుట్టు విప్పుతామని ఎస్పీ స్పష్టం చేశారు.
కర్ణాటకలో పది వేల పాత ఫోన్లతో సైబర్ రాకెట్!
పాత మొబైల్ ఫోన్లకు డిమాండ్ తగ్గిపోవడంతో ప్రజలను బురిడీ కొట్టించేందుకు బిహారీ ముఠా నయా మోసాలకు తెగబడింది. ఆరుగురు ముఠా సభ్యులు మోటార్ బైక్ లపై తిరుగుతూ పాత సెల్ఫోన్లు, సిమ్ కార్డులు ఇస్తే దీనికి బదులుగా ప్లాస్టిక్ డబ్బాలు, గృహోపకరణాలు ఇస్తామని నమ్మిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సేకరించిన మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ లను వినియోగించి ఉద్యోగాలు ఇస్తామని, మరి కొందరికి లాటరీ తగిలిందని, బ్యాంకు ఖాతా చెప్పాలని ఓటీపీ సేకరించి భారీ మోసాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ వెల్లడించారు. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే పదివేల పాత ఫోన్లు వినియోగించి సైబర్ క్రైమ్ లకు పాల్పడినట్టు ఎస్పీ వివరించారు. సైబర్ మోసాల వలలో చిక్కి బాధితులు భారీ ఎత్తున ఆర్థికంగా నష్టపోయినట్టు ఎస్పీ తెలిపారు. ఇందులో ప్రధాన సూత్రధారి బీహార్ కు చెందిన గ్యాంగ్ లీడర్ తబారక్ ను త్వరలోనే అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపినట్టు ఎస్పీ తెలిపారు.
రిక్షా కాలనీలో పట్టుబడ్డ నిందితులు…
ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీలో పాత సామాన్లు కొనుగోలు చేసే రీతిలో ఈ ముఠా పాత మొబైల్ ఫోన్లు కొంటామని మోటర్ బైక్ లపై సంచరిస్తుండగా ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అనుమానంతో వల పన్ని పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఏ 2 నిందితుడు మెరాజుల్, మహబూబ్ అలం, మహమ్మద్ జమాల్, ఎండి ఉజీర్, అబ్దుల్లా అనే ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,125 మొబైల్ ఫోన్లు, 60 బ్యాటరీలు, 107 సిమ్ కార్డులు, ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ మహాజన్ మీడియాకు వెల్లడించారు. ప్రజలు పాత సెల్ఫోన్లో కొనే వారి పట్ల, సిమ్ కార్డుల సాయంతో ఓటీపీలు అడిగే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, టూ టౌన్ సీఐ కరుణాకర్ రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.