నిజామాబాద్ క్రైమ్, ఏప్రిల్ 10(ఆంధ్ర ప్రభ) : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నిజామాబాద్ 5వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం నిజామా బాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు గురువారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రౌడీషీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎసీపీ మాట్లాడుతూ.. ఇప్పటి నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారి పేర్లు కానీ, మొహాలు కానీ ఎలాంటి కేసులోనైనా, గ్రూపు తగాదాలలో ఐనా ఎవరి ప్రోద్బలంతో, ప్రభలంతోనైనా, ఎవరైనా ఫోన్లలో చెప్పడం వలన గానీ, నేరాల్లో పాలుపంచుకోకూడదన్నారు. ఈ కౌన్సి లింగ్ కు హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాల్లో పాలుపంచుకుంటే చట్టంలో ఉన్న యాక్ట్ ల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడప వలసి వస్తుందని ఏసీపీ హెచ్చరించారు.
కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణం మీ నేర ప్రవృత్తిని విడిచి కుటుంబ సభ్యులతో కలిసి మంచి జీవన ఉపాధి ఏర్పరచుకొని సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. చెడు బుద్ధితో కొంతమంది చెప్పిన మాటలు విని, నమ్మి చట్ట వ్యతిరేకమైన కార్యకాలపాలకు పాల్పడితే…. జైలుపాలు అవడం తప్పదన్నారు. బిర్యానీ ప్యాకెట్లు, మందు, కొంత డబ్బు లభిస్తుందేమో కానీ అది శాశ్వతమైనది కాదు. రౌడీ షీటర్ల పై ప్రత్యేకంగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు,..రాత్రి, పగలు సమయంలో మీ ఇండ్లను సందర్శించి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుందన్నారు. మీపై ఒక ప్రత్యేక టీం చేత నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.. మిమ్మల్ని గమనిస్తూ ఉంటామన్నారు. ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా సత్ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తులను గుర్తించి వారి రౌడీషీట్లను తీసేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పె క్టర్ శ్రీనివాస్, 5వ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.