CMRF | వైద్యం కోసం కూటమి ప్రభుత్వం కృషి
మంత్రి బాల వీరాంజనేయ స్వామి
CMRF | టంగుటూరు, ఆంధ్రప్రభ : పేద ప్రజల వైద్యం కోసం ఆర్ధిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పెద్దఎత్తున ముఖ్యమంత్రి (Chiefminister) సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు రూ.66లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం మంత్రి పంపిణీ చేశారు.
ఈసందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ… పేద ప్రజల వైద్యం (Medical) కోసం ఆర్ధిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పెద్దఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. నేటి వరకు కొండపి నియోజకవర్గంలో 1245 మంది లబ్దిదారులకు 9కోట్ల 70 లక్షల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించామన్నారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషన్ (Digitalization) చేసి సంజీవిని పథకం ద్వారా ప్రజల ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ రూ.25లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలను అందిస్తూ వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

