వేములవాడ, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని మహాలక్ష్మి వీధిలో గల జమ్మి చెట్టు వద్ద షమీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు పట్టణంలోని ప్రధాన వీధులలో ఎడ్లబండ్లపై ఆది శ్రీనివాస్ తోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పుర ప్రముఖులు ర్యాలీ నిర్వహించారు. షమీ పూజ అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పుర ప్రముఖులతో కలిసి అలయ్ బలాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

