Vikarabad – గిరిజన హాస్టల్లో టెన్త్ విద్యార్థి మృతి
వికారాబాద్ జిల్లాలో విషాదం
హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా?
సిబ్బందికి దాడికి దిగిన బంధువులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతీగృహంలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. బుధవారం రాత్రి పడుకున్న విద్యార్థి ఉదయం లేవకపోవడంతో హాస్టల్ సిబ్బంది పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన డాక్టర్లు కొద్ది గంటల ముందే విద్యార్థి చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ విషయం తెలియగానే బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో హాస్టల్ సిబ్బందిపై కర్రలతో దాడికి యత్నించారు. కాగా, విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిన అదుపులోకి తెచ్చారు.