సిరిసిల్ల జిల్లా : భారీ వర్షాల కారణంగా గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద ఐదుగురు పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ చర్యల్లోకి దిగి బాధితులను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వరద ముప్పులో చిక్కుకున్న ఈ ఐదుగురికి తక్షణ సహాయం అందించడానికి… డ్రోన్ల సహాయంతో ఫుడ్ డెలివరీ చేశారు.
జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేష్లు మాట్లాడుతూ, పరిస్థితిని అంచనా వేసి ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.
బండి భరోసా..
ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామితో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్లో మాట్లాడారు. భయపడొద్దని, అధికారులు మిమ్మల్ని కాపాడుతారని ధైర్యం చెప్పారు. స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా సంజయ్ ఆరా తీశారు.
బాధితులెవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భయపడటం లేదని, అధికారులు కాపాడతారనే నమ్మకం ఉందని స్వామి చెప్పారు.