కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Bhupalapalli ) మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleswaram) అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్కు (Medigadda) వరద ప్రవాహం (Flood Flow ) పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత (pranahita) నది, తెలంగాణలోని గోదావరి నదుల ప్రవాహం పెరుగుతున్నది.
బుధవారం బరాజ్ ఇన్ ఫ్లో 31,900 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, గురువారం ఉదయానికి అది 71,900 క్యూసెక్కులకు చేరింది. దీంతో బరాజ్లోని మొత్తం 85 గేట్లను (85 gates ) ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్లో ప్రస్తుత వరద ప్రవాహం సముద్ర మట్టానికి 89.40 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.