హైదరాబాద్, ఆంధ్రప్రభ : అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరరును ఇందిరా క్యాంటిన్గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పు పట్టారు. ఈ పేరు మార్పు హిందూ విశ్వాసాలకు అవమానమని అన్నారు. హైదరాబాద్లో 5 రూపాయలకే మీల్స్ పథకం అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటిన్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ మార్పుకు హామీ ఇచ్చిందని, కానీ 18 నెలల్లో అది చేసింది కేవలం పేరు మార్పు మాత్రమే.. అని విమర్శించారు. విశ్వవిద్యాలయాలు పేరు మార్చింది, ఆసుపత్రులు, నీటిపారుదల ప్రాజెక్టులు, అవార్డుల పేరు,ఫ్లైఓవర్ల పేరు, గృహ నిర్మాణ పథకం పేరు, వ్యవసాయ రుణ ప్రోత్సాహకాల పేరు, హరితహారం కార్యక్రమం పేరు, విభాగాల పేర్లు, అధికారిక నివాసం పేరు, తెలంగాణ తల్లి మారింది అని పేర్కొన్నారు.
ఇది పాలన కాదు..
హైదరాబాద్లో రూ.5 భోజన పథకాన్ని దైవిక దాత అన్నపూర్ణ దేవత నుంచి ఇందిరా గాంధీగా మార్చారని, ఇది పాలన కాదు.. ఇది హిందూ విశ్వాసాలకు అవమానం.. అని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో పేదల ఆకలిని తీర్చేందుకు రూ.5 తో ‘అన్నపూర్ణ భోజన పథకం’ పేరిట స్కీమ్ తెచ్చింది. ఈ స్కీమ్ను ఇందిరా క్యాంటీన్గా పేరు మార్చుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే లభించేది. కానీ ప్రస్తుతం కొత్త నిర్ణయం ప్రకారం ఉదయాన్నే టిఫిన్ కూడా అందించనున్నారు. ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్లు కేవలం రూ.5కే అందించనున్నట్లు స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.