Breaking News | కొలంబో ఎయిర్ పోర్ట్ లో ప‌హ‌ల్గామ్ ముష్క‌రులు ?…

కొలంబో -చెన్నై: తమిళనాడులోని చెన్నై నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయలుదేరిన ఆ దేశ విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులున్నట్లు ఈమెయిల్‌ అందింది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీలంకను అలెర్ట్‌ చేశారు. ఈనేపథ్యంలో కొలంబో చేరుకున్న ఆ దేశ విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. శనివారం ఉదయం 11.05 గంటలకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు ఒక ఈమెయిల్‌ అందింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లే శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్ విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు అందులో ఉంది. ‘ఆ విమానంలో ఉన్న ఐదుగురు దక్షిణ భారతీయులైన పురుషులు లష్కరే కార్యకర్తలు. క్లీన్ ప్రొఫైల్‌, బాగా శిక్షణ పొందినవారు, ఎలాంటి అనుమానం లేదు’ అని ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

కాగా, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. నిఘా వర్గాల సమాచారంగా భావించారు. శ్రీలంకన్‌ విమానం అప్పటికే చెన్నై నుంచి బయలుదేరడంతో కొలంబో ఎయిర్‌పోర్ట్‌కు ఈ సమాచారం అందించి అలెర్ట్‌ చేశారు. దీంతో అక్కడ ల్యాండైన ఆ విమానంలోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను గుర్తించలేదని శ్రీలంక తెలిపింది. ఈ నేపథ్యంలో బెదిరింపు ఈమెయిల్‌గా దీనిని పరిగణించారు.

Leave a Reply