india vs pak| ఇంకొన్ని గంటల్లో హైవోల్టేజ్ వార్

india vs pak| ఇంకొన్ని గంటల్లో హైవోల్టేజ్ వార్
- భారత్, పాక్ మధ్య క్రికెట్ ఫైట్
- టీ20 వరల్డ్ కప్ భాగంగా గ్రూప్ మ్యాచ్
- జోరుమీదున్న టీమ్ఇండియా
- కొలంబో ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో మ్యాచ్
- రాత్రి 7 గంటలకు ప్రారంభం
- స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లైవ్

ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు అభిమానులు టీవీల ముందు నుంచి లేవరు. ఈ రెండు జట్ల మధ్య జరిగే ఆట కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. ఇరు దేశాల ప్రజలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ మ్యాచ్పై ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఈ మ్యాచ్ మిస్ కావొద్దని ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇరు జట్ల మధ్య ఆటను ఆటలా చూడరు. ఒక యుద్ధంలా చూస్తారు. ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లో ట్రోఫీ గెలవకున్నా పర్లేదు కానీ… ఈ మ్యాచ్ గెలవాలని ఇరు దేశాల ప్రజలు కోరుకుంటారు. దాయాదుల పోరు అంటే అంత క్రేజ్ ఉంటుంది మరి. అయితే ఇవాళ ప్రజలకు రెండు పండగలు వచ్చాయి. ఒకటి శివరాత్రి కాగా, మరొకటి భారత్, పాకిస్థాన్ మ్యాచ్. శివరాత్రి రోజు పాకిస్థాన్పై భారత ఆటగాళ్లు శివాలెత్తాలని అభిమానులు కోరుకుంటున్నారు. యుద్ధం కాని యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. అయితే ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్, పాక్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్కు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని శ్రీలంక వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మ్యాచ్ జరిగే సమయంలో నిరంతరాయంగా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.మ్యాచ్ వివరాలు ఆంధ్రప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం..

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు (ఆదివారం) దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్లు ఢీ అంటే ఢీ అని తలపడబోతున్నాయి. ఐసీసీ టోర్నీలో పాక్పై ఘనమైన రికార్డు ఉన్న భారత్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు, ఈసారైనా విజయం సాధించాలని పాక్ భావిస్తోంది. అయితే, టోర్నీలో ఇప్పటికే చెరో రెండు మ్యాచ్లు గెలిచిన ఇరుజట్లు ఈ మ్యాచ్లో గెలిచి సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంలోకి కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది. రాత్రి 7 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లైవ్ వీక్షించొచ్చు.

ఇటీవల నెలకొన్న పరిణామాలతో పాటు ఆసియా కప్ వివాదంతో కూడా ఉండడంతో హైవోల్టేజ్ యాక్షన్ చూసే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత్కు కనీసం పోటీనివ్వలేక పోతున్న పాక్ ఈ మ్యాచ్లో ఎలా ఆడుతుందో చూడాలి. అన్ని విభాగాల్లోనూ పాక్పై భారత్ పటిష్ఠంగా కనిపిస్తోంది. మ్యాచ్ జరిగే ప్రేమదాస స్టేడియంలో పిచ్ స్పిన్కు సహకరించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇరుజట్లు స్పిన్ బలాన్నే నమ్ముకుని బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

డాషింగ్ ఓపెనర్ రెడీ
టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. అనారోగ్యం నుంచి కోలుకొని డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అందుబాటులోకి రావడం జట్టు బలాన్ని పెంచింది. అభిషేక్ రాకతో సంజూ శాంసన్ బెంచ్కు పరిమితం కానున్నాడు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ ఫామ్లో ఉండడం జట్టుకు కలసిరానుంది. తిలక్ వర్మ దాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సత్తాచాటాల్సి ఉంది. పేస్ ఆల్రౌండర్లు హర్దిక్ పాండ్యా, శివమ్ దూబెలు ఫామ్లు కొనసాగించాల్సి ఉంది. అక్షర్ పటేల్కు తోడుగా యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నాడు. స్పిన్ పిచ్ నేపథ్యంలో సుందర్ను ఆడించనున్నారు. సుందర్ రాకతో గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన రింకూ సింగ్ను పక్కనపెట్టనున్నారు. ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్లు పేస్ భారాన్ని పంచుకోనున్నారు.

పాక్ కొంత బలహీనంగా…
భారత్తో పోలిస్తే పాక్ బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉందనే చెప్పాలి. సాహిబ్జాదా ఫర్హాన్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఫామ్లో లేరు. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ దూకుడుగా ఆడాల్సి ఉంది. సయిమ్ అయూబ్, సల్మాన్ ఆఘా ఉస్మాన్ ఖాన్లు ఎంతమేర రాణిస్తారో చూడాలి. తారిఖ్తో పాటు స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ కీలకం కానున్నారు. షహీన్ షా అఫ్రిది ఎంతమేర రాణిస్తాడో చూడాలి. అయితే పాక్ కొత్త బౌలర్ తారిఖ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భిన్నమైన శైలితో బౌలింగ్ చేస్తున్న తారిఖ్ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడితే భారత్కు కష్టాలు తప్పవు. ఇతన్ని మెరుగ్గా ఎదుర్కొటే భారత్నే విజయం వరిస్తుంది.

