హైదరాబాద్ : అర్హులైన పేదలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా రేషన్ సరుకులు తీసుకోకుండా కార్డులను నిరుపయోగంగా ఉంచుతున్న వారిపై దృష్టి సారించింది. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ సరుకులు వినియోగించుకోని కార్డులను రద్దు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే అన్ని మండల కేంద్రాల నుంచి అధికారులు సేకరించారు.
ఈ క్రమంలో, గత ఆరు నెలల వ్యవధిలో ఒక్కసారి కూడా రేషన్ కార్డుల (Ration cards) తో సరుకులు పొందని వారి సంఖ్య 78,842గా తేలింది. ఈ కార్డులన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) ఈ వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించి, క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టింది. ప్రధానంగా నల్గొండ, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇలా నిరుపయోగంగా ఉన్న కార్డులు అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.