Maoists | 37 మంది మావోయిస్టుల లొంగుబాటు

( చింతూరు, ఆంధ్రప్రభ ప్రతినిధి ) : చత్తీస్గఢ్ రాష్ట్రంలో 37 మంది మావోయిస్టులు అక్కడ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కేంద్రంలో ఆ రాష్ట్ర డీఐజీ రాకేష్ చౌదరి, దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ముందు ఆదివారం 37 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో పాటు లొంగిపోయారు.
ఈ 37 మంది మావోలు జనజీవన స్రవంతిలో కలవడానికి డీఐజీ కార్యాలయంలో ఎస్పీ సహాకారంతో అధికారుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 8 లక్షల రివార్డు కలిగిన కువ్లిు అలియాస్ అనిత, గీత అలియాస్ లక్ష్మీ, రంజన్ అలియాస్ సోమ, భీమి అలియాస్ జహాజ్ అనే నలుగురు మహిళలు ఉన్నారు.
ఈ నలుగురు ప్లాటోన్, ఏరియా కమిటీలతో సంబంధం కలిగి ఉన్నారు. వీరిలో చాలామంది 2024 గోబెల్, తులతులి ఎన్కౌంటర్లో, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కాల్పులు, దోపిడీలతో సంబంధం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
లొంగిపోయిన వారందరికీ తక్షణ సాయం కింద రూ. 50 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు-, నైపుణ్య శిక్షణ, వ్యవసాయ భూమి మొదలైన అందుతాయని డీఐజీ పేర్కొన్నారు. ఈ లొంగుబాటు డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ 80,111,230 జవాన్ల సహకారంతో ఈ లొంగబాట్లు జరిగాయని ఎస్పీ గౌరవరాయ్ తెలిపారు.
దంతెవాడ జిల్లాలో గత 20 నెలల్లో అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారని వారిలో 165 మంది రివార్డు కలిగిన వారు ఉన్నారని తెలిపారు.
ఇంటికి రండీ అనే ప్రచారం కింద 333 మంది రివార్డు కలిగిన మావోయిస్టులు జనజీవనంలోకి వచ్చారని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద 1160 మంది మావోయిస్టులు లొంగిపోగా వారిలో 916 మంది పురుషులు, 244 మహిళలు ప్రధాన స్రవంతిలో కలిశారని తెలిపారు. ప్రత్యేక ఐజి సుందర్ రాజ్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసల వీడి శాంతిని స్వీకరించాలని కోరారు
