27marcheditorial | అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు..

27marcheditorial | అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు..

27marcheditorial | ఐక్యరాజ్యసమితి శాంతి యత్నాలపై సందేహాలు
హార్మూజ్ జలసంధి ప్రభావం భారత్‌పై
ట్రంప్ ప్రకటనలపై ప్రపంచ అనుమానాలు
యుద్ధవిరమణపై స్పష్టత లేకపోవడం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు ఇరాన్తో చర్చలకు సిద్ధమ వుతూనే, భూతల దాడులకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే, అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. నిజానికి యుద్ధాన్ని ముగించాలన్న ఉద్దేశ్యం ఎవరికీ లేదు. ప్రపంచ దేశాల ముందు తాము నిజాయితీగా ప్రయత్నాలు చేస్తున్నామనే భావన కలిగించేందుకు ఇటు అమెరికా, అటు ఇరాన్ ప్రయతిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం అదుపు తప్పిందనీ, శాంతియత్నాలకు దౌత్యవేత్త జీన్ ఆర్నాల్డ్ను నియమించినట్టు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి జనరల్ గుటెరెస్ ప్రకటించారు. మరో వైపు యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ అనుసరించాల్సిన పంథాను గురించి పార్లమెంటులో అన్ని పార్టీలనూ సంప్రదించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలియజేసింది. నిజానికి హర్మూజ్ గుండా చమురు, గ్యాస్ నౌకల రాకపోకల విషయంలో భారత్‌కు ఇరాన్ వెసులుబాటు కల్పించిన దృష్ట్యా మన దేశానికి ముంచుకొచ్చిన ఇబ్బందేమీ లేదు.

అయితే, ప్రస్తుతం మనవద్ద 60 రోజులకు సరిపడే ఇంధనం మాత్రమే ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను తాము తిరస్కరించినట్టు, చర్చలకు తలుపులు మూసేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ కొత్త సంవత్సరం వేళ తమ దేశాధినేతను చంపేసిన నాయకులతో చర్చలు ఏమిటని ఇరాన్ మండిపడింది. అయితే, ఈ యుద్ధం అమెరికా, ఇరాన్లకు మాత్రమే పరిమితమైనది కాదు. యావత్ ప్రపంచంలో శాంతిని పాదుకొల్పేందుకేనని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అది నిజమే కానీ, సమితి ఎప్పుడో తీసుకోవాల్సిన చొరవ ఇంత భారీ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు తీసుకోవడం వల్ల దాని సలహాకు విలువ లేకుండా పోయింది. హార్మూజ్ జలసంధి పై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని ఇరాన్ వాదిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమదే పైచేయి అని ఇటు అమెరికా, అటు ఇరాన్ ప్రకటించుకుంటున్నాయి. ఇరాన్ జలసంధిని భద్రతను పర్యవేక్షించే అధికారి అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్స్క చెందిన నౌకాదళ చీఫ్ ఆలీ రెజా తంగ్సిరి మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.

దీంతో ఇరాన్ హార్మూజ్ జలసంధిలో నౌకల ప్రవేశంపై తన వైఖరిని కఠినతరం చేసింది. భారత్ సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు మాత్రమే ఈ జలసంధి ద్వారా రాకపోకలను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ యుద్ధంలో ఆధిపత్యం కోసం అమెరికా, ఇరాన్లు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితులలో యుద్ధవిరమణపై ట్రంప్ ఎన్ని ప్రకటనలు చేసినా నమ్మేందుకు ఆస్కారం కనిపించడం లేదు. తన మాటలు ఎవరూ నమ్మడం లేదని ట్రంప్ గ్రహించారు. తన మాటలను సీరియస్‌గా తీసుకోండంటూ బతిమాలే స్వరంతో ఆయన మాట్లాడుతున్నారు. అయితే, ట్రంప్ ఇంత వరకూ మాట్లాడిన తీరును బట్టి ఆయన ఇప్పుడు సీరియస్‌గా మాట్లాడుతున్నారని ఎవరూ అనుకోవడం లేదు. తనను ఇరాన్ సుప్రీం లీడర్ ఉండమని ఇరానియన్లు కోరారని ట్రంప్ చేసిన ప్రకటనను బట్టి ఆయన మాటలు ఎంత నిజాయితీతో కూడినవో అర్థం అవుతోంది.

Leave a Reply