200 RTC buses | 34 ఏళ్ల నిరీక్షణకు మోక్షమెన్నడో?
- బెల్లంపల్లి ప్రజలకు నెరవేరని కల!
200 RTC buses | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి వాణిజ్య ప్రధాన కేంద్రం.. సింగరేణి గనులకు సమీపా పట్టణం.. బొగ్గు కార్మికులు రాకపోకలు చేయడానికి ఇదే ప్రధాన పట్టణం కూడా! అలాంటి బెల్లంపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు 34 ఏళ్ల(34 years old) కిందట ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి పట్టణంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ప్రజల చిరకాల వాంఛ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh state)లోనే 1991లోనే ఆర్టీసీ డిపో మంజూరైనట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. 34 ఏళ్ల నిరీక్షణకు ఎప్పుడు మోక్షం కలుగుతుందని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యే హామీ ఏమైంది?
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తనకు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే స్థాయిలోనే బెల్లంపల్లిలో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయిస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికే రెండేళ్లు గడుస్తున్నా, ఇంత కీలకమైన హామీని నెరవేర్చకపోవడంపై పట్టణ, నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఎన్నికలకు ముందు హామీలివ్వడం, గెలిచాక విస్మరించడం పరిపాటిగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. తమ ఎమ్మెల్యే ఈ సమస్యను ఏనాడు పట్టించుకోకపోవడం బాధాకరం అని పేర్కొంటున్నారు.
లక్షల ఆదాయం.. శూన్యం సౌకర్యం
బెల్లంపల్లి పట్టణం ప్రతిరోజూ సుమారు 200కు పైగా ఆర్టీసీ బస్సులు(200 RTC buses) రాకపోకలు చేస్తుంటాయి. వ్యాపార, ఇతర అవసరాల రీత్యా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (తిర్యాని, రెబ్బెన, ఆసిఫాబాద్, పెంచికల్ పేట), మంచిర్యాల జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఉన్న దాదాపు 300 గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. దీని ద్వారా ఆర్టీసీ సంస్థకు ప్రతిరోజూ లక్షల్లో ఆదాయం సమకూరుతోంది.
డిపో ఏర్పాటు ద్వారా ప్రయోజనాలు
• 300 గ్రామాలు, 12 మండలాలకు ప్రధాన రవాణా కేంద్రంగా మారుతుంది.
• నెలవారీగా వచ్చే లక్షలాది రూపాయల ఆదాయాన్ని సంస్థ మెరుగుపరుచుకోగలదు.
• స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
బెల్లంపల్లిని మరిచిన ప్రభుత్వం..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ బస్సు డిపోల ఏర్పాటు, బస్టాండ్ల ఆధునికీకరణకు కోట్లాది రూపాయలు కేటాయించింది. కానీ బెల్లంపల్లి పట్టణాన్ని ప్రభుత్వం మరిచిపోయిందని స్థానికులు అన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిలో రూ. 11.70 కోట్ల(Rs. 11.70 crores)తో 4.78 ఎకరాల్లో బస్సు డిపో పనులు కొనసాగుతున్నాయి.
అలాగే ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రూ.6.28 కోట్లతో 3.79 ఎకరాల పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఈ రెండు డిపోలను మంజూరు చేశారు. ఎంతో అవసరం ఉన్న బెల్లంపల్లిలో మాత్రం డిపో ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


