150-bed hospital | బీఆర్ఎస్పై తరగని అభిమానం

150-bed hospital | బీఆర్ఎస్పై తరగని అభిమానం
- పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం
- మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
150-bed hospital | మక్తల్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్పై ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని, ఇందుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. సగం సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Govt) హామీలు అమలు చేయకుండా చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించారన్నారు.
అందుకే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. అనేక గ్రామాల్లో ఒకటి నుంచి 10, 20, 30 ఓట్ల తేడాతో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందారన్నారు. మక్తల్ మండలంలోని ముసలాయిపల్లి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ఓటు తేడాతో గెలుపొందాడన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళ నాలుగు ఓట్లు వేసినా ఎన్నికల(election) సిబ్బంది అభ్యంతరం చెప్పకపోవడం దారుణమన్నారు.
పోలింగ్ ఏజెంట్లు, అక్కడి బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ఆ ఎన్నికపై ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పునరాలోచించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నాలుగు ఓట్లు దొంగ ఓట్లు వేయడం వల్లే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఒక ఓటు తేడాతో గెలుపొందారని తెలిపారు. లేదంటే మూడు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేవారున్నారు.
ఈ ఎన్నికపై ఎలక్షన్ కమిషన్ అక్కడి విధులు నిర్వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవకాశముంటే ముసలాయిపల్లిలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రెండేళ్లలో చేసిందేమీ లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఉద్యోగాలను భర్తీ చేయడం తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు.
మక్తల్లో 150 పడకల ఆసుపత్రి(150-bed hospital), ప్రభుత్వ డిగ్రీ కళాశాల వంటివి తన హయాంలోనే మంజూరు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందని బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు పి. నరసింహగౌడ్, కే. రాజేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, చిన్న హనుమంతు, సలీం పాల్గొన్నారు.
