Zakia Khanam | తెల్ల‌వారు ఝామున వైసిపికి రాజీనామా… గంట‌లోనే బిజెపి తీర్థం

ఎపి మండలి వైస్ ఛైర్ ప‌ర్స‌న్ జ‌కియా ఖానం జంపింగ్ క‌హాని

అమరావతి: ఎపి శాస‌న మండ‌లి వైస్ చైర్ ప‌ర్స‌న్ జ‌కియా ఖానం కేవ‌లం అర‌గంట వ్య‌వ‌ధిలో పార్టీ మార్చేశారు.. నేటి తెల్ల‌వారుజామున వైసిపి పార్టీకి ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. ఈ ప్ర‌క‌ట‌న విడులైన గంట‌లో క‌మ‌ల తీర్థం పుచ్చుకున్నారు.. వివ‌రాల‌లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అధికారం ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీకి ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం తన పదవికి , పార్టీకి రాజీనామా చేశారు.

రాజీనామా చేసిన గంటల్లోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్రా కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జకియా ఖానం మాట్లాడుతూ ప్రధాని మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా కల్పిస్తున్నారని వ్యాఖ్యనించారు.

ఏడాదిలో ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా
ఇక జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. ఆమెను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్‌ నామినేట్‌ చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం మండలి వైస్‌ చైర్మన్‌గా నియమించింది. కాగా, అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆమె గత రెండేండ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇప్పటికే మంత్రి నారా లోకేశ్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. దీంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరింది. ఎట్టకేలకు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమెతో కలిపి ఇప్పటివరకు వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిలో జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌, కర్రి పద్మశ్రీ, పోతుల సునీతలు ఉన్నారు. తాజా జ‌కియా కూడా రాజీనామా చేసిన వారి జాబితాలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *